జయలలిత ఆగ్రహం: పన్నీరుసెల్వం హౌస్ అరెస్ట్?
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే పార్టీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి వరకు 'అమ్మ' జయలలితకు ఎంతో నమ్మకం కలిగిన వాడిగా ఉన్న మజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంపై అమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.
పన్నీరు సెల్వంను జయలలిత హౌస్ అరెస్టు చేయించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను నమ్మిన బంటు నమ్మకద్రోహానికి పాల్పడటంతో అతని పైన అమ్మ కన్నెర్ర చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జయ ఎంతో విశ్వసించే పన్నీరుసెల్వం పైన ఆమెకు కోపం వచ్చిందంటే పార్టీ వర్గాలే నమ్మలేకపోతున్నాయట.
అందుకు చాలా పెద్ద కారణమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పన్నీరుసెల్వం టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే అతనికి అమ్మ చెక్ పెట్టారనే వాదనలు వినిపిస్తన్నాయి. జయలలితకు వారసులు లేరు. దీంతో ఆమె తన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మంత్రులుపై నిఘా ఉంచారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు పన్నీరుసెల్వంపై ఆరోపణలు రావడంతో తప్పించారని అంటున్నారు. పన్నీరు సెల్వం విషయమై విపక్షాలు పెద్దగా నోరు మెదపడం లేదు. అయితే వైగో లాంటి నేతలు మాత్రం.. మంత్రులను గృహనిర్బంధం చేశారని విమర్శలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటుగా ఉండేవారు. ఆస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లిన సమయంలోను తాను నమ్మిన సెల్వంను ఆ పీఠంపై కూర్చుండబెట్టారు. ఆమె జైలు నుంచి రాగానే ఆయన తప్పుకొని, అమ్మకు మళ్లీ పదవిని అప్పగించారు.
అలాంటి పన్నీరుసెల్వంపై ఇప్పుడు అమ్మ ఆగ్రహంతో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పన్నీరుసెల్వంతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు పోల్ ప్యానెల్లో లేకపోవడం గమనార్హం. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.