ఆరేళ్ల వయసులో తప్పిపోయి.. ఎక్కడో పెరిగి.. పన్నెండేళ్ల వయసులో..
ఎప్పుడో ఏడేళ్ల క్రితం పుణ్యక్షేత్రానికి వెళుతుండగా తప్పిపోయి.. ఎక్కడో పెరిగి.. ఇన్నేళ్లకు ఇప్పుడు అమ్మానాన్నల ఒడి చేరిన బాలిక కథ ఇది.
కేంద్రపారా: ఎప్పుడో ఏడేళ్ల క్రితం పుణ్యక్షేత్రానికి వెళుతుండగా తప్పిపోయి.. ఎక్కడో పెరిగి ఇప్పుడు అమ్మానాన్నల ఒడి చేరింది ఓ బాలిక. ఇది ఒడిశాలోని నిమాపారాకు చెందిన పూజాఖౌడియా(12) కథ.
2010లో కుటుంబంతో కలిసి పూరీక్షేత్రానికి వెళుతుండగా పూజ వారి నుంచి వేరైపోయింది. అప్పుడామె వయసు సుమారు ఆరేళ్లుండవచ్చు. తప్పిపోయిన ఆ చిన్నారి దారీతెన్నూ తెలియక... అమ్మా నాన్న కనపడక అల్లాడింది.
చివరకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చేరుకుంది. అక్కడి ఓ శిశుసంరక్షణ కేంద్రం పూజను అక్కున చేర్చుకుంది. ఆ బాలిక అక్కడే పెరిగింది. ఓ రోజు గూగుల్లో ప్రముఖ దేవాలయాల ఫొటోలు వెతుకుతున్న పూజకు పూరీ జగన్నాథ్ ఆలయం కనిపించింది.

మరుక్షణం ఆమె మదిలో తన చిన్ననాటి జ్ఞాపకాలు మెదిలాయి. తానుంటున్న సంరక్షణ కేంద్రం సిబ్బందికి పూజ విషయాన్నంతా చెప్పింది. వారు నెల్లూరు పోలీసులకు సమాచారమందించారు. వారు వెంటనే పూరీలోని పోలీసులను సంప్రదించారు.
దీంతో అక్కడి పోలీసులు గల్లంతైన పిల్లల కేసుల దస్త్రాలను వెలికి తీసి చూశారు. చివరికి పూరీ జిల్లాలోని నిమాపారాగ్రామస్తులైన శ్యాంఖౌడియా, ముని ఖౌడియాలు తమ బిడ్డ తప్పిపోయిందంటూ అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదు తాలూకు దస్త్రాన్ని పోలీసులు కనుగొన్నారు.
అయితే, 2011లోనే నిమాపారా నుంచి పూజ తలిదండ్రులు పూరీకి వచ్చేయగా, పోలీసులు వారి కోసం అన్వేషించారు. చివరకు వారు పూరీలో ఉంటున్న సంగతి కనుక్కొన్నారు. పూజ కుటుంబం ఫొటోలను నెల్లూరు పోలీసులకు పంపారు.
అక్కడి సంరక్షణ కేంద్రం నుంచి పూజ ఆ సంరక్షణ కేంద్రానికి వచ్చినప్పటి నుంచీ తీసిన ఫోటోలను ఆమె తలిదండ్రులకు అందచేశారు. పూజ అమా నాన్నా ఇద్దరూ తమ బిడ్డను గుర్తుపట్టారు.
పూజ కూడా అమ్మానాన్నలను చూడగానే గుర్తించింది. చట్టపరమైన అన్ని లాంఛనాలూ పూర్తయిన తర్వాత అమానాన్నలతో కలిసి పూజ ఆనందంగా తమ ఊరికి వెళ్లిపోయింది. ఇలా కథ సుఖాంతమైంది.












Click it and Unblock the Notifications