చైనాకు దీటుగా మన ఒడిశా.. 15 రోజుల్లో 1000 పడకల కరోనా ఆస్పత్రి.. రాబోయేది మరింత గడ్డుకాలం..
''కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి చైనాలో ఆస్పత్రి కట్టారు.. ఇండియాలో కాలర్ టోన్ పెట్టించారు''అనే విమర్శనాత్మక జోక్ వైరలైంది. కరోనా పుట్టినిల్లు వూహాన్ సిటీలోనే కేవలం 10 రోజుల్లోనే చైనా సర్కారు భారీ ఆస్పత్రిని నిర్మించింది. రెండు నెలల లాక్ డౌన్ లో డాక్టర్లు, వైద్య సిబ్బంది అవిశ్రాంత శ్రమతో ఆ దేశం ఎట్టకేలకు కరోనా ముప్పు నుంచి బయటపడగలిగింది. మన దేశంలోమాత్రం వైరస్ విజృంభణ ఈమధ్యే మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం 10లక్షల మంది వైరస్ బారినపడొచ్చన్న భయాలు వ్యక్తమయ్యాయి. అయితే..

కేంద్రం కంటే ముందే..
వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. పరిశ్రమలు, పనులు బంద్ కావడంతో ఉపాధి కోల్పోయే పేదల కోసం ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. హెల్త్ సెక్టార్ బలోపేతానికి ప్రత్యేకంగా రూ.15వేల కోట్లు కేటాయించినప్పటికీ భారీ ఇంపాక్ట్ చూపగల పథకాన్ని మోదీ సర్కార్ రూపొందించలేదు. ఆ లోపాన్ని పూడ్చుతూ ఒడిశా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కావడానికి ఒక రాష్ట్రమే అయినప్పటికీ.. చైనాకు దీటుగా కరోనా ఆస్పత్రి నిర్మాణానికి కంకణం కట్టుకుంది.

దేశంలో మొదటిది..
ప్రత్యేకంగా కొవిడ్-19 రోగులకు చికిత్స అందించడానికే ఒడిశాలో నిర్మించతలపెట్టిన ఆస్పత్రిపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం కీలక ప్రకటన చేశారు. మొత్తం 1000 పడకలు ఉండేలా, కేవలం కరోనా బాధితుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని, 15 రోజుల్లోపే అక్కడ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోనే దీన్ని నిర్మిస్తామన్నారు. ఇండియాలో ఈ తరహా ఆస్పత్రి నిర్మాణం ఇదే మొదటిది కావడం గమనార్హం.

ఎలా కడతారంటే..
కరోనా పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా చేపట్టిన ఆస్పత్రి నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వంతోపాటు కార్పొరేట్ సంస్థలు, మెడికల్ కాలేజీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్(ఓఎంసీ), మహానది కోల్డ్ ఫీల్డ్స్(ఎంసీఎల్) సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్)లో భాగంగా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంటున్నాయి. అలాగే ఎస్యూఎం, కేఐఐఎంఎస్ మెడికల్ కాలేజీలు కూడా ముందుకొచ్చాయి. మూడు పక్షాలకు చెందిన ప్రతినిధుల మధ్య ఈ గురువారం భువనేశ్వర్ లో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రెండు వేర్వేరు ఒప్పందాల ద్వారా.. పక్కపక్కనే.. ఒకటి 500 పడకలు, రెండోది 450 పడకల ఆస్పత్రుల్ని నిర్మించనున్నారు. చైనా తరహాలోనే భారీ క్రేన్లు, సిబ్బంది సహాయంతో జెడ్ స్పీడ్ వేగంతో నిర్మాణాన్ని పూర్తి చేయాలని నవీన్ సర్కారు ప్రణాళికలు వేసింది.

ఎందుకీ సాహసం?
విస్తీర్ణం పరంగా దేశంలో ఎనిమిదో అతిపెద్ద రాష్ట్రమైన ఒడిశా.. ఆర్థికస్థితిగతుల్లో మాత్రం 16వ స్థానంలో ఉంది. తూర్పు భాగంలోని బీహార్, బెంగాల్, జార్ఖండ్ లాగే అభివృద్ధిలో వెనుకబడ్డప్పటికీ.. గుజరాత్, మహారాష్ట్ర లాంటి బడా రాష్ట్రాలను తోసిరాజని ప్రత్యేకంగా కొవిడ్-19 ఆస్పత్రి నిర్మాణానికి ఒడిశా ముందుకు రావడం గమనార్హం. నిజానికి ఆ రాష్ట్రంలో హెల్త్ సెక్టార్ లో సేవలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. డబ్బులు లేని చోట కార్పొరేట్లు అడుపెట్టరన్నది ఎంత వాస్తవమో ఒడిశా హెల్త్ సెక్టార్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని కాపాడుకోడానకి ఉన్న ఆప్షన్ ఆస్పత్రుల నిర్మాణం ఒక్కటేనని నవీన్ సర్కారు భావిస్తున్నది.

ఇదీ పరిస్థితి..
గురువారం ఒక్కరోజే కొత్తగా 42 కేసులు రావడంతో దేశవ్యాప్తంగా మొత్తంగా కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 649కి పెరిగింది. ఒడిశాలో అత్యల్పంగా రెండు కేసులు మాత్రమే నమోదైనప్పటికీ.. రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని నవీన్ సర్కారు అంచనా వేస్తున్నది. ప్రస్తుతం ఒడిశా మొత్తానికి ఒక్క భువనేశ్వర్ లోనే ఒకేఒక వైరాలజీ ల్యాబ్ అందుబాటులో ఉంది. కరోనా వ్యప్తి తర్వాత కేంద్రం కొత్తగా ప్రకటించిన ల్యాబ్స్ ద్వారా రెండో దాన్ని సంబల్ పూర్ లో ఏర్పాటుచేస్తున్నారు. సడెన్ గా కేసుల సంఖ్య పెరిగినా తట్టుకునేందుకే ప్రభుత్వం ఆస్పత్రి నిర్మాణానికి ముందుకొచ్చింది. కాగా,

వేసవిలో విలయం తప్పదా?
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై ఒడిశా ప్రభుత్వ అధికార ప్రతినిధి సుబ్రతో బాగ్చీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. లాక్ డౌన్ చిన్నపిల్లల ఆట కాదని, అన్నీ ఆలోచించే ప్రభుత్వాలు ఆ నిర్ణయానికి మొగ్గుచూపాయని అన్నారు. అయితే ఊహించిన దానికంటే వైరస్ వేగంగా వ్యపిస్తున్నదని, మే 31 నాటకి దేశంలో 10 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా ఆశ్చర్య పోనవసరం లేదని, అందులో ఒడిశా వంతుగా సుమారు 35 వేల కేసులు ఉండొచ్చని, ఆ పరిస్థితి రావొద్దనే తామంతా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు బాగ్చీ చెప్పారు.












Click it and Unblock the Notifications