బెంగళూరులో దుమ్ములేపుతున్న వానలు, ఎలక్షన్ ఎఫెక్ట్, లీడర్స్ కు 70 ఎంఎం సినిమా !
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు చాలా బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులకు కర్ణాటక రాజధాని బెంగళూరు మీద కన్నుపడింది. అయితే బెంగళూరులో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో అన్ని పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం చెయ్యలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోజురోజుకు బెంగళూరులో వానల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత 24 గంటల్లో బెంగళూరులో 60. 5 మిల్లిమీటర్ల వర్షం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడటటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకురాలేకపోయారు.

హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో 46. 5 మిల్లీ,మీ, యశవంతపురంలో 60. 5 మిల్లీ,మీ, సింగసంద్రలో 54 మిల్లీ, మీ, యలహంకలోని కేఎస్ ఎన్ డీఎంపీ క్యాంపస్ ఏరియాలో 46 మిల్లీ, మీ, జక్కూర్ ఎయిపోర్టు ప్రాంతంలో 41,5 మిల్లీ,మీ, బెళ్లందూర్లో 35 మిల్లీ,మీ, కోడిగేహళ్లిలో 30 మిల్లీ, మీ, అట్టూరులో 29,5 మిల్లీ,మీ, గరుడాచారపాళ్యలో 25.5 మిల్లీ, మీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.
బెంగళూరులో గరిష్టంగా 29 డిగ్లీల సెల్సియస్, కనిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. మే 7వ తేదీ వరకు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఆదివారం బెంగళూరులో పలు ప్రాంతాల్లో 111.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. బుధవారం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల దెబ్బకు పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మే7వ తేదీ వరకు బెంగళూరులో 33 డిగ్రీల సెల్సియస్ నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications