omicron: మెడికల్ కాలేజీలో 30 మంది విద్యార్థులకు కరోనా: జీనోమ్ సీక్వెన్సింగ్కు నమూనాలు
బెంగళూరు: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, కర్ణాటక రాష్ట్రంలోని కొల్లార్ మెడికల్ కాలేజీలో 30 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే, ఒమిక్రాన్ అనుమానంతో ఆ 30 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.
జిల్లా యంత్రాంగం కోలార్లోని శ్రీ దేవరాజ్ ఉర్స్ మెడికల్ కాలేజీలో 1,160 మంది విద్యార్థులు, సిబ్బందిని కోవిడ్ కోసం పరీక్షించింది. కరోనా సోకిన విద్యార్థులందరూ ఆస్పత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
కాగా, క్లస్టర్లో పాజిటివ్గా వచ్చిన వారిలో ఎవరికీ ప్రయాణ చరిత్ర లేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పాజిటివ్ రోగులందరి నమూనాలు పంపబడ్డాయి. కర్ణాటకలో టెస్ట్ పాజిటివిటీ రేటు 0.35శాతంగా ఉంది. రాష్ట్రంలో 31 వైరస్ కేసులు అత్యంత అంటువ్యాధి ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసుల్లో ఇప్పటివరకు 15 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కర్ణాటకలో మొత్తం 7,251 కోవిడ్ కేసులు ఉన్నాయి. 15,588 మంది ప్రయాణికులు ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత ఎట్ రిస్క్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని, డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రంలో ఎటువంటి పార్టీలు లేదా సామూహిక సమావేశాలను అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం పేర్కొంది.
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
మరోవైపు, రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 43కు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వెల్లడించారు.
కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో ఐదుగురు ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇక, రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో ఒక్క జైపూర్ నుంచే 28 కేసులు ఉండటం గమనార్హం. ఆ తర్వాత అజ్మేర్లో 7, సికర్లో 4, ఉదయపూర్లో 3 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం షఒమిక్రాన్ కేసుల సంఖ్య 437కు చేరింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు ఉండగా, ఢిల్లీలో 79, గుజరాత్ రాష్ట్రంలో 43 కేసులు ఉన్నాయి. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు: ఆంక్షల దిశగా రాష్ట్రాలు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూలు, వివిధ రూపాల్లో ఆంక్షలను అమలు చేయాలని సూచించింది. అంతేగాక, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ పాకింది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 400 దాటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఒమిక్రాన్ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఉన్నతస్థాయి బృందాలను పంపించాలని నిర్ణయించామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిబెంగాల్, మిజోరం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్తున్నాయని పేర్కొంది.
శనివారం ఉదయం నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత ఢిల్లీలో ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 38 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 7వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా కేరళలో 2605, మహారాష్ట్రలో 1410, తమిళనాడులో 597 కేసులు వెలుగుచూశాయి.
కాగా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. హర్యానా కూడా ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆంక్షలున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై పలు చోట్ల నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను చేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేస్తున్నాయి.