ఒమిక్రాన్ తీవ్రత తక్కువే కానీ, వచ్చే నెలలో కేసుల ఉధృతి: ఐఎంఎఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇంతకుముందు వేరియంట్ల కంటే తీవ్రత తక్కుగానే ఉన్నప్పటికీ.. వ్యాప్తి వేగం అత్యధికంగా ఉండటంతో అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో ఆంక్షల బాటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచుతున్నాయి. వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తున్నాయి.
Recommended Video
ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం: ఐఎంఎఫ్ గీతా గోపీనాథ్
తాజాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) స్పందించింది. ఒమిక్రాన్ ప్రభావం గురించి నిశితంగా అధ్యయనం చేస్తున్నట్లు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తెలిపారు. అయితే, ఈ వేరియంట్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై తుది అంచనాకు రాలేదని చెప్పారు. వచ్చే నెలలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
డెల్టా కంటే తీవ్రత తక్కువే కానీ..
డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. వచ్చే నెల(జనవరి, 2023)లలో కొత్త వేరియంట్ పెరిగే అవకాశం ఉందన్నారు గీతా గోపీనాథ్. ఒమిక్రాన్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణముందని నివేదికలను బట్టి తెలుస్తోందన్నారు. అందుకు తగినట్లుగానే వేగంగా ప్రబలితే.. ప్రయాణాలపై ఆంక్షలు ఉండే అవకాశం ఉందన్నారు. ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు సృష్టించవచ్చని అన్నారు. అందుకే ప్రపంచ దేశాలు మొత్తం వ్యాక్సిన్లు పొందాల్సి ఉందన్నారు. లేకపోతే ఇలా కొత్త వేరియంట్లతో ఇబ్బంది పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాక్సిన్లదే కీలక పాత్ర: గీతా గోపీనాథ్
కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కూడా కొంత రక్షణ లభిస్తుందని గీతా గోపీనాథ్ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టీకా అసమానతలు తీవ్ర విషాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఆదాయ దేశాలు తమ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేయగా, అల్పాదాయ దేశాలు 4 శాతం మందికి మాత్రమే టీకాలు అందాయని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. 80 దేశాలు ఆ లక్ష్యాన్ని చేరుకోలేవని గీతా గోపీనాథ్ అంచనా వేశారు. టీకాల డోసుల కొరతే అందుకు కారణమని అన్నారు. కొత్త వేరియంట్ల వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో.. టీకాలు, వైద్య సామాగ్రిపై ఆంక్షలు విధించవద్దని అభివృద్ధి చెందిన సంపన్న దేశాలకు గీతా గోపీనాథ్ సూచించారు. కరోనా వైరస్ వేరియంట్లను అడ్డుకునేందుకు టీకా ఒకటే మార్గమని వ్యాఖ్యానించారు.