స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. రోజుకు 14 లక్షల కేసులు వచ్చే ప్రమాదం.. కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దూసుకోస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 26 మందికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. దేశంలో నమోదైన సగం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
దేశంలో 111కి చేరిన ఒమిక్రాన్ కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఇప్పటికే 77 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి భారత్లోనూ స్పీడ్ పెంచింది. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యాపించింది. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 111కి చేరింది.. శుక్రవారం 26 మందికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్థారణ అయింది. ఢిల్లీలో కొత్తగా 12 మందికి సోకింది.
దీంతో ఢిల్లీలోని కేసుల సంఖ్య 22 చేరింది. మహారాష్ట్రలో 8 మందికి కొత్తగా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 40కి చేరింది. కేరళలో కొత్తగా రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ బాధితుల సంఖ్య 7కు చేరింది. గుజరాత్, తెలంగాణలోనూ రెండు కేసుల చొప్పున నిర్ధరణ అయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 8కి చేరింది. గుజరాత్ లో 7, తమిళనాడు, ఏపీ, చండీగఢ్, పశ్చిమబెంగాల్ లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
రోజుకు 14 లక్షల కేసుల రావొచ్చు..
యూరప్తో పాటు ఇతర దేశాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బ్రిటన్ లో ఇప్పటికే 11 వేలకు పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాని పేర్కొంది. ఆ దేశాల పరిస్థితి ఇండియాలో వస్తే 14 లక్షల కేసులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. గత 20 రోజులుగా కరోనే కేసులు 10వేల లోపే వస్తున్నప్పటికీ ఒమిక్రాన్ విజృంభణతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
అనవసర ప్రయాణాలు వద్దు.. సింపుల్గా న్యూ ఇయర్ వేడుకలు
దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం మొత్తం 7,447 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,26,049కి పెరిగిందని తెలిపింది. వైరస్ బారిన పడి నిన్న 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 86,415కి తగ్గాయి. రికవరీ రేటు 98.38 శాతం పెరిగిందని పేర్కొంది. ఇప్పటి వరకు 136 కోట్ల టీకా డోసులు పంపిణీ పూర్తి చేసిట్లు తెలిపింది.
మరోవైపు దేశంలోని 19 జిల్లాల్లో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం చేయాలని కోరింది. గుంపులు గుంపులు ఉండరాదని, న్యూ ఇయర్ వేడుకలను కూడా సింపుల్ గా జరుపుకోవాలని కేంద్రం సూచించింది.
Recommended Video
ఆరోగ్యానికి ఒమిక్రాన్ పెనుముప్పు
ఒమిక్రాన్ ఇప్పటికే 77 దేశాలకు వ్యాపించడంతో ప్రపంప ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మరిన్ని దేశాలకు వ్యాపిస్తుందని హెచ్చరించింది. ఈ వైరస్ ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుందని పేర్కొంది. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ఈ మహమ్మారి ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది.