సామాజిక వ్యాప్తి స్థాయికి ఒమిక్రాన్ వేరియంట్: నగరాల్లో ప్రబలంగా వైరస్ విజృంభణ
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులతోపాటు కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కాగా, ఒమిక్రాన్ వేరియంట్( సార్స్ కోవ్-2 వైరస్) మనదేశంలో సామాజిక వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్సార్టియం(ఇన్సాకాగ్) తెలిపింది. మెట్రో నగరాల్లో సామాజిక వ్యాప్తి ప్రభావంతంగా మారిందని వెల్లడించింది.
ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలంగా ఉందని పేర్కొంది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది. వ్యాక్సిన్ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించడం జరిగింది.
ఒమిక్రాన్ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు బహిర్గతం కావడం లేదు. మరికొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, టీకా వేసుకోని హైరిస్కు ఉన్న వ్యక్తుల్లోనూ ఇటువంటి తక్కువ ప్రభావాన్ని చూపుతుందని భావించడం సరికాదని ఇన్సాకాగ్ హెచ్చరించింది.
వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని తెలిపింది. అంతమాత్రాన ఒమిక్రాన్ ను నిర్లక్ష్యం చేయడం సరికాదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం ఇన్సాకాగ్.. వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్లోని వైవిధ్యాలను పరిశోధిస్తోంది.
కాగా, దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,75,533 నమూనాలను పరీక్షించగా.. 3,33,533 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. మహమ్మారితో పొరాడుతూ 525 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,87,205కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది.
దేశంలో కరోనా రికవరీ రేటు 93.18 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2, 59, 168 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 3,65,60,650కి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3.89 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,89,409 మంది మృతి చెందారు.
కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161, 92,84,270 మందికి కరోనా వ్యాక్సిన్ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లోనే 71 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకునట్లు పేర్కొంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారిలో 4,15,77,103 మందికిపైగా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.