'కొట్టండి... వాళ్లను చావగొట్టడమే కరెక్ట్...' రెచ్చిపోయిన కోవిడ్ మృతురాలి బంధువులు... వైద్యులపై దాడి...
ఢిల్లీలోని సరిత విహార్లో ఉన్న అపోలో ఆస్పత్రిపై ఓ కోవిడ్ పేషెంట్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వైద్యులు,నర్సులు,ఇతర మెడికల్ సిబ్బందిపై దాడికి దిగారు. ఆస్పత్రిలో ఐసీయూ బెడ్ దొరక్క పేషెంట్ చనిపోవడంతో... ఆగ్రహించిన పేషెంట్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు ముఖానికి మాస్కు ధరించి వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగింది....
ఢిల్లీకి చెందిన 62 ఏళ్ల ఓ వృద్దురాలు ఇటీవల కోవిడ్ బారిన పడింది. సోమవారం(ఏప్రిల్ 26) రాత్రి కుటుంబ సభ్యులు ఆమెను సరిత విహార్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూ బెడ్ కోసం కొన్ని గంటల పాటు వేచి చూసినా లాభం లేకపోయింది. ఇదే క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆ కోవిడ్ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది.కోవిడ్ బాధితురాలి మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
'కొట్టండి... వాళ్లను చావగొట్టడమే కరెక్ట్...'
ఉదయం 9గంటల సమయంలో ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లి వైద్యులు,నర్సులు,ఇతర సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బూడిద రంగు కుర్తా వేసుకున్న ఓ వ్యక్తి కర్రతో దాడికి పాల్పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో వీడియోలో ఎర్ర చొక్కా,తెల్ల చొక్కా ధరించిన ఇద్దరు వ్యక్తులు సిబ్బందిపై దాడికి పాల్పడటం రికార్డయింది. 'కొట్టండి... వాళ్లను చావగొట్టడమే కరెక్ట్..' అంటూ కామెంట్ చేయడం ఆ వీడియోలో స్పష్టంగా వినబడుతోంది.
భద్రత పెంచాలని ఆదేశించిన మరుసటిరోజే...
తూర్పు ఢిల్లీ డీసీపీ మాట్లాడుతూ... ఇప్పటికైతే ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఆస్పత్రి వర్గాలు గానీ,పేషెంట్ బంధువులు గానీ ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.ఆస్పత్రుల వద్ద పోలీస్ భద్రత పెంచాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన మరుసటిరోజే ఈ దాడి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కోవిడ్ మరణాలు పెరిగిన నేపథ్యంలో... మృతుల కుటుంబ సభ్యులు,బంధువులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి ఆస్పత్రుల వద్ద పోలీస్ భద్రత పెంచాలని ఆదేశించింది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఆస్పత్రుల్లో గత మూడు రోజుల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పేషెంట్లు చనిపోయారు. దాదాపుగా అన్ని ఆస్పత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోవడంతో కొత్తగా వచ్చే పేషెంట్లకు బెడ్లు దొరకడం కష్టంగా మారింది.