అట్టుడుకుతున్న డార్జిలింగ్: ఆరో రోజుకు చేరిన బంద్.. ఆందోళనలు హింసాత్మకం!
డార్జిలింగ్ బంద్ ఆరో రోజుకి చేరుకున్న నేపథ్యంలో.. ఇప్పటికీ హోటల్స్, బిజినెస్ షాపులు, మార్కెట్లు ఇతరత్రా అన్ని ఇంకా మూసివేసే ఉన్నాయి.పరిస్థితిని అదుపు చేయడం కోసం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.
డార్జిలింగ్: ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు శనివారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలను అణిచివేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో ఇరు వర్గాల మధ్య నిత్యం ఘర్షణ చెలరేగుతూనే ఉంది.
తాజా ఘర్షణల్లో ఓ అసిస్టెంట్ కమాండర్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో డార్జిలింగ్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జీజీఎం కార్యకర్తలు, ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే జీజీఎం నాయకుల దూకుడుకు బ్రేక్ వేయాలని భావిస్తున్న పోలీసులు.. వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా ఓ పోలీస్ అధికారి ఒక నిరసనకారుడిని కత్తితో పొడిచినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జీజీఎం ఎమ్మెల్యే అమర్ రాయ్ కుమారుడు విక్రమ్ రాయ్ ను పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
అలాగే సీనియర్ జీజీఎం నేత బినయ్ తమంగ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది కార్యకర్తలు కూడా ఈ విధ్వంసంలో పాల్గొన్నారని బినయ్ ఆరోపించారు.
'గత రాత్రి లోకల్ జర్నలిస్ట్ విక్రమ్ రాయ్ ను అరెస్టు చేశారని తెలిసి మేమంతా షాక్ తిన్నాం. కోల్ కతాలో ఉన్న పలు మీడియా సంస్థలకు అనుబంధంగా రాయ్ పనిచేస్తున్నాడు. డార్జిలింగులో జర్నలిస్టులకే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుంది?' అని బినయ్ తమంగ్ ప్రశ్నించారు.
పౌర వ్యవహారాల శాఖ భవనానికి జీజీఎం మద్దతుదారులు అర్థరాత్రి నిప్పు పెట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తృణమూల్ కాంగ్రెస్ యాక్టివిస్ట్ డియోరాజ్ గురుంగ్ ఇంటిపై కూడా కొంతమంది ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. డార్జిలింగ్ బంద్ ఆరో రోజుకి చేరుకున్న నేపథ్యంలో.. ఇప్పటికీ హోటల్స్, బిజినెస్ షాపులు, మార్కెట్లు ఇతరత్రా అన్ని ఇంకా మూసివేసే ఉన్నాయి.
పరిస్థితిని అదుపు చేయడం కోసం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులు, భద్రతా సిబ్బంది డార్జిలింగ్ లో అనువణువు నిఘా పెట్టినట్లు సమాచారం.