మంత్రి దంపతుల మీద లోకాయుక్తకు ఫిర్యాదు
బెంగళూరు: ఆహారధాన్యాలు సరఫరా చేసే టెండర్ ఇవ్వడానికి లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ మంత్రి, ఆయన సతీమణి మీద కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని లోకాయుక్త అధికారులకు మనవి చేశారు.
కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ, ఆయన సతీమణి విజయా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మానవహక్కుల సంఘం నాయకుడు గిరీష్ గౌడ లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ హాస్టల్స్ కు ఆహారాధాన్యాలు సరఫరా చెయ్యడానికి టెండర్ తమకే కేటాయించాలని ఓ కాంట్రాక్టర్ మంత్రి ఆంజనేయ సతీమణి విజయాను కలిసి లంచం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఓ ప్రయివేటు టీవీ చానెల్ స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టింది.
తరువాత ఆ దృశ్యాలను చానెల్ లో ప్రసారం చేశారు. తనకు, తన భార్యకు లంచం తీసుకోవలసిన అవసరం లేదని, ఈ లంచం కేసుకు మాకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి ఆంజనేయ వివరణ ఇచ్చారు.
ఇదే సమయంలో మంత్రి ఆంజనేయ వ్యవహారం గురించి కాంగ్రెస్ హై కమాండ్ ఆరా తీసింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర నాయకులకు సూచించిందని సమాచారం. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ విషయం పై ఇంత వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications