మహిళా రిజర్వేషన్ బిల్లు పై ప్రధాని మోడీకి.. సోనియాగాంధీ సవాల్
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలని ఆమె కోరారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలని ఆమె కోరారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు అవకాశాలు కల్పించనున్నారు. అయితే ఈ బిల్లుపై గత కొన్నేళ్లుగా చర్చ సాగుతున్నా, దానికి లోక్సభలో ఆమోదం మాత్రం దక్కడం లేదు.
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి లోక్సభలో కావాల్సిన మెజారిటీ ఉంది. సరిపోను మెజారిటీ ఉంది కాబట్టి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం దక్కేలా చూడాలని ఆమె ప్రధానిని కోరారు.
2010లో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించలేదు. అప్పటి విపక్ష పార్టీలైన సమాజ్వాదీ, ఆర్జేడీ, తృణామూల్ నుంచి కాంగ్రెస్కు తగిన మద్దతు లభించలేదు.
అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎంపీలు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రధాని మోడీ పదేపదే అంటున్న విషయం తెలిసిందే.
2019లో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును తేవాలంటూ ప్రధానికి లేఖ రాశారు.