Onam Bumper lottery: రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటోడ్రైవర్, ట్యాక్స్ పోగా ఆయన చేతికొచ్చేది ఎంత?
కేరళకు చెందిన అనూప్ అనే ఆటోడ్రైవర్ కేరళ ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో రూ. 25 కోట్లు గెలుచుకున్నారు.
తిరువనంతపురానికి సమీపంలో శ్రీవారం ప్రాంతానికి చెందిన అనూప్, ఈ ఏడాది ఓనం బంపర్ లాటరీ విజేతగా నిలిచారు.
ఓనం పండగ సందర్భంగా నిర్వహించే ఈ బంపర్ లాటరీలో ఈ ఏడాది అత్యధికంగా రూ. 25 కోట్లను ప్రైజ్ మనీగా ప్రకటించారు. శనివారంనాడు భాగ్యవతి లాటరీ ఏజెన్సీ నుంచి టికెట్ కొనుక్కున్న అనూప్, మరుసటి రోజే విజేతగా నిలిచారు.
ప్రస్తుతం ఆటో నడుపుకుంటున్న అనూప్, తనకు బంపర్ లాటరీ తగిలిందని తెలిసినప్పటి నుంచి ఆనందంతో పొంగిపోతున్నారు. గతంలో ఓ హోటల్లో పని చేసిన అనూప్, మలేషియా వెళ్లి అక్కడ షెఫ్గా స్థిరపడాలని భావిస్తున్నారు.
https://twitter.com/ANI/status/1571562945200685056
ఇందుకోసం ఆయన బ్యాంక్ లోన్కు కూడా అప్లై చేశారు. ఇటీవలే లోన్ శాంక్షన్ కూడా అయ్యింది. ఈలోగానే ఆయనకు బంపర్ లాటరీ తగిలింది.
''కరోనా మహమ్మారి కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాను. నా కష్టాలకు పెట్రోలు ధరల పెరుగుదల కూడా తోడయ్యింది. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటానికి మలేషియా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. లోనుకు దరఖాస్తు చేశాను.
వెళ్లాలా వద్దా అన్నది ఇప్పుడు ఆలోచిస్తాను'' అని అనూప్ హిందుస్థాన్ టైమ్స్తో అన్నారు.
ఇంతకు ముందు తాను పేదరికంతో బాధపడ్డానని, ఈ డబ్బును జాగ్రత్తగా వాడుకుంటానని అనూప్ అన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.
ప్రైజ్ మనీ ఎవరికి ఎంత?
ఆదివారం మధ్యాహ్నం కేరళ ఆర్ధిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్ ఈ బంపర్ డ్రాలో విజేతను ఎంపిక చేశారు.
ఈ ఏడాది ఓనం బంపర్ లాటరీలో ప్రకటించిన ప్రైజ్మనీ, కేరళ లాటరీల చరిత్రలోనే అతి పెద్ద ప్రైజ్ మనీ అని ఏఎన్ఐ పేర్కొంది.
ఈ డ్రాలో రెండో విజేతకు రూ. 5 కోట్ల రూపాయలు అందుతాయి. మూడో ప్రైజ్కు పదిమందిని ఎంపిక చేసి, వారిలో ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున ఇస్తారు.
పన్నులు పోను, 15 కోట్ల 75 లక్షల రూపాయలు అనూప్కు అందనున్నట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఈ లాటరీ టిక్కెట్ అమ్మిన ఏజెన్సీ యజమాని థంకరాజ్కు కూడా కొంత కమీషన్గా అందుతుంది.
- సిలికాన్ వాలీ సీఈవో ఇంత చిన్న ఊరిలో ఎందుకుంటున్నారు
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
రికార్డు స్థాయిలో అమ్మకాలు
ఈ ఏడాది 66 లక్షలకు పైగా ఓనమ్ బంపర్ లాటరీ టిక్కెట్లు అమ్ముడయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ లాటరీలో ఒక్కో టిక్కెట్ ఖరీదు రూ. 500. గత ఏడాది టికెట్ ధర రూ.300
''గత ఏడాది 54 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఆ రికార్డు బద్ధలైంది. 66.54 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ బంపర్ లాటరీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది'' అని ఆర్ధికమంత్రి బాలగోపాల్ పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది.
గత ఏడాది ఓనమ్ బంపర్ లాటరీ ప్రైజ్ మనీ రూ.12 లక్షలు కాగా, గత ఏడాది కూడా ఓ ఆటో డ్రైవరే ప్రైజ్మనీ గెలిచారు.
కేరళ ప్రభుత్వ ఆదాయంలో లాటరీల ద్వారా వచ్చే డబ్బు ప్రధానమైనది. ఈ లాటరీని కేరళ స్టేట్ లాటరీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- కింగ్ చార్లెస్ 3: ఆయనకున్న 12 భవనాల్లో ఏది రాజనివాసం కాబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- యూరప్లో నదులు అంతరించిపోతాయా? నదులు ఎందుకు వరుసగా ఇలా ఎండిపోతున్నాయి, నీటి కోసం ఏం చేయాలి?
- మహారాష్ట్ర గుహలలో చరిత్ర విప్పని రహస్యాలు ఇంకా ఉన్నాయా? ప్రాచీన మానవుడి కళాకృతులు, వస్తువులు ఏ నాగరికతవి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)