మళ్లీ ఉల్లంఘన: పాక్ బలగాల కాల్పులు, జవాన్ మృతి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ బలగాల కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ బలగాలు జమ్మూ ప్రాంతంలోని ఆర్ఎస్ పురా సెక్టారులో భారత్ శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఒక బిఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు.
సీనియర్ పోలీసులు అధికారు ఒకరు ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ... జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు ఆర్ఎస్ పురా సెక్టారు వద్ద పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడన్నారు. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఉన్న ఇరవై ప్రాంతాల్లో ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు.
82 ఎంఎం మోర్టార్స్, భారీ ఆయుధాలు తదితరాలను మోహరిస్తోందని అధికారు చెప్పారు. బుధవారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో కాల్పులు సాగినట్లు చెప్పారు. బిఎస్ఎఫ్ జవాన్ పాక్ కాల్పులను ధీటుగా తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారన్నారు.
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం జమ్మూలో పర్యటించారు. పాక్ బలగాలు కాల్పులకు పాల్పడిన ప్రాంతాలలో ఆయన పర్యటించారు.
కాగా మీడియా రిపోర్ట్స్ ప్రకారం... పాకిస్తాన్ బలగాలు మోడల్ విలేజ్ వద్ద గల కీరన్ సెక్టారులోని పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాక్ మంగళవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.