పళనిసామికి షాక్: 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: కొత్త గ్రూపు లీడర్‘తోపు ’!
అన్నాడీఎంకే పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు మరో గ్రూపుగా తయారై తిరుగుబాటు చెయ్యడంతో ఎడప్పాడి పళనిసామి వర్గీయులు హడలిపోయారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి సొంత పార్టీకి చెందిన నాయకులు రోజుకొక సినిమా చూపిస్తున్నారు. సీఎం పళనిసామికి కంటిమీద కునుకులేకుండా చేస్తూ ఆయన్ను ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యేలు రోజుకొక గ్రూపుగా తయారు కావడంతో ఎడప్పాడి పళనిసామితో సహ ఆయన వర్గీయులు తల పట్టుకున్నారు.
మంగళవారం తాజాగా మరో గ్రూప్ గా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చీలిపోయారు. మా డిమాండ్లు తీర్చకుంటే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వం అంటూ తేల్చి చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎడప్పాడి పళనిసామి వర్గీయులు హడలిపోయారు. మరో వర్గంగా చీలిపోయిన ఎమ్మెల్యేలతో మంతనాలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
రంగంలోకి ‘తోపు'వెంకటాచలం
మంగళవారం తెరమీదకు వచ్చిన కొత్త గ్రూపు ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తోపు వెంకటాచలం నాయకత్వం వహించారని వెలుగు చూసింది. ఈయన కోయంబత్తూరు, సేలం, మధురై తదితర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ఓ గ్రూప్ తయారు చేశారని వెలుగు చూసింది.
జయలలితకు నమ్మినబంటు
2011లో జయలలిత ముఖ్యమంత్రి అయిన సమయంలో తోపు వెంకటాచలంను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో కేపీ మునిసామి లాంటి సీనియర్లు మంత్రి వర్గంలో ఉన్నారు. అయితే పలు ఆరోపణలపై కేపీ మునిసామితో సహ అనేక మంది సీనియర్లను మంత్రి వర్గం నుంచి తప్పించారు. తన నమ్మినబంటు తోపు వెంకటాచలంను ఐదేళ్ల పాటు మంత్రిగా పని చెయ్యడానికి జయలలిత అవకాశం ఇచ్చారు.
మరోసారి ఇవ్వలేదని
ప్రస్తుత మంత్రి వర్గంలో తోపు వెంకటాచలంకు స్థానం దక్కలేదు. ఈ విషయంపై తనకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన మంతనాలు జరిపారు. ఆయన కంటూ ఓ వర్గం తయారు చేసుకుని ఎడప్పాడి పళనిసామికి సినిమా చూపించడానికి ఇప్పుడు సిద్దం అయ్యారు.
సీఎం, తోపుది ఒకే సామాజిక వర్గం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, మాజీ మంత్రి తోపు వెంకటాచలం ఒకే సామాజికి వర్గానికి (గౌండర్) చెందిన వారు. ఇప్పుడు అదే సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాలకు చెందిన 13 మంది ఎమ్మెల్చేలను తోపు వెంకటాచలం ఓ గ్రూపుగా తయారు చేసుకున్నారు.
ఎన్ని గ్రూపులు
ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు (28 మంది) నాలుగు గ్రూపులుగా చీలిపోయారు. శశికళ సోదరుడు దివాకరన్ సైతం తన వైపు కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఐదు గ్రూపులుగా ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇప్పుడు మరో గ్రూపుగా చీలిపోయి ఆరు గ్రూపులుగా తయారైనారు.
నేను ఎవర్ని, ఎడప్పాడి పళనిసామికి డౌట్
అసలు తాను ముఖ్యమంత్రి అనే విషయం ఎమ్మెల్యేలకు గుర్తు ఉందా ? అంటూ ఎడప్పాడి పళనిసామి తన సన్నిహితుల దగ్గర విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. రోజుకొకరు గ్రూపులుగా చీలిపోయి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారని తెలిసింది.
పగవాడికి ఈ కష్టాలు ఉందంటున్న సీఎం
పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారని తెలిసింది. ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గం సీఎంకు సినిమా చూపిస్తున్నారు. ఆయనతో రాజీకావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. .
సినామా చూపిస్తున్నారు
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఓ గ్రూపుగా తయారైనారని, ఇప్పుడు మరో గ్రూప్ తయారైయ్యిందని పళనిసామి విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. పన్నీర్ సెల్వం వర్గంతో రాజీ అయ్యే సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురౌతున్నాయని పళనిసామి తలపట్టుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
వస్తారా
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 28 మంది ఎమ్మెల్యేలు, తోపు వెంకటాచలం గ్రూపులోని 13 మంది ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఆయన పదవి ఊడిపోతుంది. అంతకు ముందే ఏదో ఒకటి చెయ్యాలని పళనిసామి వర్గం రంగంలోకి దిగడానికి సిద్దం అయ్యింది.