ఆగని మృత్యు ఘంటికలు: గోరఖ్పూర్ ఘోరకలిలో 79కి గోరఖ్ పూర్ మృతుల సంఖ్య
ఉత్తరప్రదేశ్లో చిన్నారుల పాలిట మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో గానీ పసికందుల ప్రాణాలు కళ్లెదుటే గాల్లో కలిసిపోతున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో చిన్నారుల పాలిట మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో గానీ పసికందుల ప్రాణాలు కళ్లెదుటే గాల్లో కలిసిపోతున్నాయి.
బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ(బీఆర్ డీ) ఆసుపత్రిలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 79కి చేరింది. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా దీనిపై ఇంతవరకు సరైన చర్యలు తీసుకోనట్లుగానే కనిపిస్తోంది.
ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఆసుపత్రి చీఫ్ ను తొలగించారు తప్పితే మెరుగైన చికిత్స ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందన్న విమర్శలున్నాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లే చిన్నారులు మృతులు చెందినట్లుగా సీఎం యోగి స్వయంగా ప్రకటించడం గమనార్హం. మరోవైపు పోలీసులు మాత్రం 21మంది చిన్నారులు మాత్రమే ఆక్సిజన్ అందక చనిపోయారంటూ మరో వాదన వినిపించారు.
ఆదివారం ఒక్కరోజే మరో 16 మంది చిన్నారులు చనిపోవడంతో మృతుల సంఖ్య 73కి చేరుకుంది. 48గం.ల్లోనే ఇంతమంది చిన్నారులు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తీవ్ర కళ్లెదుటే పసికందులను దూరం చేసుకుంటున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. ఆసుపత్రి వర్గాలపై చిన్నారుల కుటుంబ సభ్యులు అనుమానాలు వెలిబుచ్చుతుండటం గమనార్హం.
యూపీలో 63కు చేరిన చిన్నారుల మరణాలు: యోగి సీరియస్, అసలేం జరిగింది?
Recommended Video
నిజానికి అగస్టు 7నుంచే వరుసగా చిన్నారులు చనిపోతున్న ఘటనలు జరుగుతున్నా.. ఆసుపత్రి వర్గాలు మాత్రం నిర్లక్ష్యం వహించాయన్న ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై కథనాలు ప్రచురించింది.
'ఇది విషాదం కాదు.. ముమ్మాటికీ మారణకాండే. ఆక్సిజన్ సరఫరా లేక అంతమంది కన్నుమూయడం దారుణం' అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి ట్వీట్ చేశారు. మరింత మంది చిన్నారులు బలైపోకుండా కాపాడటానికి మరికొన్ని ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించినట్లు చెబుతున్నప్పటికీ.. మరో ఇద్దరు చిన్నారులు మరణించడం, అటు ప్రభుత్వ, ఇటు ఆసుపత్రి వర్గాల వైఫల్యాన్ని తెలియజేస్తోంది.
ఆసుపత్రిని సందర్శించిన యోగి ఆదిత్యనాథ్:
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ పరిస్థితిని సమీక్షించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతోపాటు వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.