అమెరికా తరహాలో బీహార్ కౌంటింగ్ -రాత్రి దాకా తుది ఫలితాలు రావు -మధ్యాహ్నానికి 20శాతమే -కారణాలివే
సరిగ్గా వారం రోజుల కిందట(మంగళవారం) అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో చోటుచేసుకున్న హైడ్రామానే.. ఇప్పుడు(మంగళవారం) బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లోనూ కనిపిస్తున్నది. అమెరికాలో ఓట్లన్నీ బ్యాలెట్ల రూపంలో పడినా, బీహార్ లో పూర్తిగా ఈవీఎంలను వాడినా.. కౌంటింగ్ దగ్గరికి వచ్చేసరికి సీన్ మారింది. ఈవీఎంలో ఓట్ల లెక్కింపులో సాధారణంగా మధ్యాహ్నానికి ఫలితాల ట్రెండ్స్ వెలువడతాయి. కానీ బీహార్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే..

మధ్యాహ్నానికి 20 శాతమే కౌంటింగ్
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 243 చోట్లా కౌంటింగ్ కొనసాగుతున్నది. గెలవడానికి మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లుకాగా, తాజా అప్ డేట్స్ ప్రకారం ఎన్డీఏ 126 స్థానాల్లో, మహాకూటమి 109 స్థానాల్లో ఇతరులు 9 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. అయితే ఇవి మొత్తం పోలైన ఓట్లలో పావుశాతం కూడా కావు. ఎన్నికల అధికారుల వివరణ ప్రకారం మధ్యాహ్నం 1గంట వరకు కేవలం 20 శాతం ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే.. బీహార్ లో ఈసారి మొత్తం 4కోట్ల మంది ఓట్లేస్తే ఈ వార్త రాస్తున్న సమయానికి కేవలం 87.8లక్షల ఓట్లను మాత్రమే కౌంట్ చేశారు. అందులోనూ..

గరిష్టంగా 35 రౌండ్ల కౌంటింగ్..
ఆయా పార్టీలు ఆధిక్యత కనబరుస్తోన్న స్థానాల్లో.. 31 శాతం సీట్లు 1000 ఓట్లలోపు ఓట్లు మాత్రమే తేడా ఉంది. 23 సీట్లలో ఓట్ల తేడా 500 లోపే ఉంది. ఎనిమిది స్థానాల్లో ఓట్ల తేడా 200లోపే ఉంది. కేవలం 20 శాతం ఓట్లలోనే ఇంత హోరాహోరీ పోరాటం జరుగుతుండగా.. బీహార్ లో గరిష్టంగా 30 నుంచి 35 రౌండ్ల కౌంటింగ్ కొనసాగాల్సి ఉండటంతో ఉత్కంఠ తప్పేలా లేదు. చివరి సీటుకు కూడా ఫలితం తేలేదాకా సస్పెన్స్ థ్రిల్లర్ తప్పదు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మంగళవారం రాత్రికిగానీ తుది ఫలితాలు వెల్లడయ్యేలా లేవు. కౌంటింగ్ ఆలస్యానికి గల కారణాలను విశ్లేషిస్తే..

కౌంటింగ్ ఆలస్యానికి కారణాలివే..
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ శనివారానికే బైడెన్ 290, ట్రంప్ 214 ఓట్లు సాధించినప్పటికీ తుది ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఎన్నికలు పూర్తయిన వారం తర్వాత కూడా 12 రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నది. కరోనా కారణంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్లు భారీగా రావడమే అక్కడ ఆలస్యానికి కారణం. ఇక బీహార్ లోనూ కరోనా పరిస్థితుల వల్లే కౌంటింగ్ నిదానంగా సాగుతోంది. ఇందుకు ప్రధానంగా కారణాలున్నాయి. ఒకటి పోలీంగ్ బూత్ ల సంఖ్యకాగా, రెండోది కౌంటింగ్ కేంద్రాలు, టేబుళ్ల పెంపు. అదెలాగంటే..

63 శాతం ఎక్కువ ఈవీఎంలు..
బీహార్ లో 2015 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి(2020లో) ఉపయోగించిన ఈవీఎంల సంఖ్య 63 శాతం ఎక్కువ. గతంలో ఒక్కో పోలింగ్ బూత్ లో గరిష్టంగా 1600 మంది ఓటర్లను అనుమతించగా, ఈసారి కరోనా వల్ల ఆ సంఖ్యను 1000లోపే కట్టడి చేశారు. దీంతో 31వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లను భారీగ పెంచిన ప్రభావం కౌంటింగ్ పైనా పడింది. 38 జిల్లాలకుగానూ మొత్తం 55 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో భారీ ఎత్తున 414 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బంది శ్రమలో ఎలాంటి తేడా లేకున్నా.. గణించే ఓట్ల సంఖ్య తక్కువ కాబట్టి ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. గరిష్టంగా 30 నుంచి 35 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం ఆలస్యానికి మరో కారణం. తద్వారా మంగళవారం రాత్రి వరకు పిచ్చర్ లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications