కరోనా వేళ ఆ ఉద్యోగాలకు ఢోకాలేదు, లాక్ డౌన్ తర్వాత మరిన్నికొలువులు..
కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతోన్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతోన్నాయి. కంపెనీలు ఉద్యోగాల కోత పెడుతున్నాయి. మరికొన్ని వేతనాలు తగ్గించుకొనే ప్రయత్నాలు బిజీగా ఉన్నాయి. కానీ ఈ సమయంలో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. సంస్థలు మిగతా ఉద్యోగాల నియామకాలను నిలిపివేసి మరీ.. సైబర్ సెక్యూరిటీ నిపుణులను అద్దె ప్రాతిపదికన తమ కంపెనీలు నియమించుకుంటున్నాయి.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ విభాగాలు సైబర్ నిపుణులను అద్దె ప్రాతిపదికన నియమించుకొనేందుకు పోటీ పడుతున్నాయి. రిమోట్ మోడల్ వర్క్ కొనసాగిస్తూ.. తమ నెట్ వర్క్ భద్రతను పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల అనిశ్చితి నెలకొన్న సెక్యూరిటీ కోసం కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ కూడా భద్రత కోసం ప్రయారిటీ ఇస్తూ.. ముందుడుగు వేస్తున్నాయి. కంపెనీల భద్రతకు సంబంధించి 15 శాతం డిమాండ్ పెరిగిందని ఎన్ఎస్ఈ టీమ్ లీజ్ స్పెషలిస్ట్ స్టాఫ్ హెడ్ సునీల్ తెలిపారు.
గత కొన్నివారాల నుంచి కంపెనీల్లో మిగతా కొత్త ఉద్యోగాలు కల్పన లేదు. డిజిటలైజేషన్ స్పెషలిస్ట్, రెగ్యులర్ డెవలపర్ స్కిల్ గల మానవ వనరుల నియామకాలు క్రమంగా పడిపోయింది. కానీ లాక్ డౌన్ తర్వాత మాత్రం సైబర్ నిపుణుల నియామకం పెరుగుతోందని క్యూ టెక్ సీఈవో ఆనంద్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఎండ్ పాయింట్ డిటెన్షన్ అండ్ రెస్పాన్స్ ఉన్న నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వారికి అధిక వేతనాలు ఇచ్చి ఆఫర్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.