ఆ కీలకాంశం వెంకయ్య నాయుడి వద్దకు ప్రతిపక్షాలు: ట్రబుల్ షూటర్ ఆయనే: కాంగ్రెస్ సైతం
న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై కొద్దిరోజులుగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలను లేవదీస్తోన్నారు. సభ ప్రారంభానికి ముందు వాయిదా తీర్మానాలు, సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసులను జారీ చేస్తోన్నారు. వాటిని చర్చించాలంటూ పట్టుబట్టుతోన్నారు. సభలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తోన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ ఉభయసభల్లో ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది.
అమెరికాతో చైనా మాటల యుద్ధం: ఘాటుగా వార్నింగ్: ఎప్పుడేం జరుగుతుందో..?
పెరిగిన ధరలు..
నిత్యావసర సరకులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై చర్చించాలనేది వారి డిమాండ్. బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు, మజ్జిగ.. వంటి ఆహార వస్తువులను కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా వాటి రేట్లు పెరిగాయి. బ్యాంకింగ్ సేవలు మరింత ప్రియం అయ్యాయి. ఆసుపత్రుల సేవలపై పెనుభారం మోపింది కేంద్ర ప్రభుత్వం. హోటల్ గదుల పరిస్థితీ ఇంతే. ఆసుపత్రులు, హోటల్ గదుల వినియోగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది.
జీఎస్టీ ఎఫెక్ట్..
ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలోకి లేని పలు రకాల నిత్యావసర సరుకులపై తాజాగా విపరీతమైన భారం పడింది. 5,000 రూపాయలకు పైగా అద్దెను వసూలు చేస్తోన్న ఆసుపత్రుల గదులను కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. వాటిపై అయిదు శాతం మేర జీఎస్టీని విధించింది. 1,000 రూపాయలకు పైగా అద్దెను వసూలు చేసే హోటల్ గదులపై ఏకంగా 12 శాతం మేర జీఎస్టీని అమలు చేసింది. ఇప్పటివరకు వీటిల్లో ఏ ఒక్కదాని మీద కూడా జీఎస్టీ వసూలు అయ్యేది కాదు.
బ్యాంకు చెక్కులపైనా జీఎస్టీ వడ్డింపు..
అలాగే- బ్యాంకుల్లో నుంచి కొత్తగా చెక్కులను తీసుకోవడం కూడా ఇవ్వాళ్టి నుంచి పెనుభారంగా పరిణమించింది. ఖాతాదారులకు బ్యాంకులు జారీ చేసే చెక్కులపై 18 శాతం మేర జీఎస్టీని ముక్కు పిండి మరీ వసూలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ఇది జీఎస్టీ పరిధిలో లేదు. సోలార్ వాటర్ హీటర్స్ పై ఇదివరకే వసూలు చేస్తోన్న జీఎస్టీ శ్లాబ్ ను సవరించింది. అయిదు శాతంగా ఉన్న దీని శ్లాబ్ ను 12 శాతానికి పెంచింది.
చర్చకు డిమాండ్..
ఆయా అంశాలన్నింటితో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణపైనా సమగ్రంగా చర్చించాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఉభయసభల్లోనూ పట్టుబట్టుతున్నారు. సభను స్తంభింపజేస్తోన్నారు. ఫలితంగా సభా కార్యకలాపాలు ముందుకు సాగట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఏకంగా 19 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు కూడా ఉన్నారు.
వెంకయ్యతో భేటీ..
దీనిపై రాజ్యసభలో 10 ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ మధ్యాహ్నం వెంకయ్య నాయుడిని ఆయన ఛాంబర్లో కలుసుకున్నారు. తమ పార్టీి చెందిన సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సభ్యులు చేస్తోన్న డిమాండ్లో అర్థం ఉందని, వారిని సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. వారు తెలియజేసిన విధానం సరైనది కాకపోయినప్పటికీ.. డిమాండ్ అర్థవంతమైనదేనని పేర్కొన్నారు.
వచ్చేవారం చర్చకు..
దీనిపై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల, నిత్యావసర సరకులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడంపై చర్చించడానికి వచ్చేవారం అవకాశం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ సరైనదే అయినప్పటికీ- దాని కోసం ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, దాన్ని తెలియజేసిన విధానం సరైనది కాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.