విపక్షాల ఐక్యతారాగం.. వచ్చే ఎన్నికలపై ఫోకస్.. కలిసికట్టుగా
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒక తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తానని చెప్పిన మమతా బెనర్జీ.. వారం క్రితం ఢిల్లీ వచ్చి పలువురు నేతలతో మంతనాలు జరిపారు. పార్లమెంట్లో ఐక్యంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టిన విపక్షాలు.. తమ ఐక్యత ఇదీ అని చూపకనే చూపాయి. ఇదే వేడిలో సోనియాగాంధీ కూడా విపక్షాలతో భారీ వర్చువల్ సమావేశానికి తెరలేపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై బీజేపీ నాయకులు చేసిన దాడులు, కుట్రలకు ఆగ్రహంగా ఉన్న మమతా బెనర్జీ.. వారిపై పగ తీర్చుకోవాలనే కసితో ఉన్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి పీఠం అధిష్ఠించగానే సీఎస్ను కేంద్రానికి సరెండర్ చేయకుండా అడ్డుకున్నారు. ఆయనతో సీఎస్ పదవికి రాజీనామా చేయించి ప్రధాన సలహాదారుగా నియమించుకుని కేంద్రంలోని మోదీ సర్కార్పై పైచేయి సాధించింది. తన పార్టీని వీడి తనపైనే పోటీ చేసి ఓడించిన సువేందు అధికారిపై పాత కేసులు బయటకు తీయించింది. ఆ తర్వాత దేశ రాజధానికి చేరుకుని తన అస్త్రాలకు పదును పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విపక్షాలకు చెందిన ముఖ్యనాయకులను కలుసుకుని బీజేపీపై సమరశంఖం పూరించింది.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 20 న విపక్ష పార్టీల నేతలో వర్చువల్ సమావేశం జరిపేందుకు సిద్ధమయ్యారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలతోపాటు ప్రతిపక్ష నాయకులతో భారీ సమావేశాన్నే ప్లాన్ చేశారు. ఈ వర్చువల్ మీటింగ్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్లను కూడా ఆహ్వానించారు.
విపక్షాల ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల వరకు ఈ వేడిని ఇలాగే కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహంపై ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు మద్ధతుగా నిలుస్తాయనే వీరి భేటీలో వచ్చే చర్చలను బట్టి ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికలలోగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సిద్ధం చేయడానికి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. అలాగే, వచ్చే ఏడాది యూపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
తొలుత మమతా బెనర్జీ, ఆ తర్వాత శరద్ పవార్ కూడా విపక్ష నేతలతో భేటీలు జరిపారు. మరోవైపు, కపిల్ సిబాల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 10 వ తేదీన తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేసి పలు పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే, ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంకలు మాత్రం హాజరుకాలేదు. ఈ డిన్నర్కు శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్, డెరెక్ ఓ బ్రియాన్, ఓమర్ అబ్దుల్లాలు హాజరయ్యారు. బీజేపీతో నిన్నటివరకు అంటకాగిన అకాళీదల్ను కూడా డిన్నర్కు పిలిచారు. నవీన్ పట్నాయక్ పిలిచినా హాజరు కాలేదు.
పెగాసస్ గూఢచర్యం కుంభకోణం, వ్యవసాయ చట్టాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై గందరగోళాన్ని సృష్టించడాన్ని కొనసాగిస్తూ వర్షాకాల సమావేశాల్లో 15 కు పైగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో ఐక్య ఫ్రంట్గా ఏర్పడ్డాయి. గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం ఏర్పడింది. చర్చ లేకుండానే అనేక బిల్లులు సభలో ఆమోదించబడ్డాయి. రాహుల్గాంధీ కూడా వీరి దారిలోనే నడిచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగానే.. 17 పార్టీల నేతలకు లంచ్కు పిలిచారు. ఈ సమావేశానికి బీఎస్పీ, ఆప్ నేతలు హాజరుకాలేదు.
పార్లమెంట్ను ప్రతిష్ఠింభజేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ సహా విపక్షాలు సఫలం చెందాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడ్తూ గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి విక్టరీ స్క్వేర్ వరకు 15 ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి మహా పాదయాత్ర నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో తొలిసారిగా ఎంపీలపై దాడిచేసి కొట్టారని రాహుల్ ఆరోపించారు.