విపక్షాల గందరగోళం: ఉభయసభలు రేపటికి వాయిదా
పార్లమెంటు ఉభయసభలు సోమవారం ఉదయం ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు సోమవారం ఉదయం ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభకు సహకరించాలని కోరినప్పటికీ విపక్షాలు ఎంత మాత్రం వినిపించుకోలేదు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ వాయిదా పడింది.
లోకసభలో కూడా విపక్షాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విపక్షాల ఆందోళనల మధ్యే లోకసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
విపక్షాల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సభకు సహకరించాలని విపక్షాలను కోరారు. ప్రధాని సభకు వస్తారని ఆయన చెప్పినా.. విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్.. సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభమైనా.. విపక్షాల ఆందోళన కొనసాగడంతో మంగళవారానికి సభను వాయిదా వేశారు స్పీకర్.
బీజేపీ సభ్యుల్ని ప్రభుత్వ ఏజెంట్లు(దలాల్) అన్న నరేష్ అగర్వాల్
రాజ్యసభలో ఎస్పీ(సమాజ్వాది పార్టీ) ఎంపీ నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. బిజెపి సభ్యుల్ని ప్రభుత్వ ఏజెంట్లు అని సంభోదించారు. దీంతో బిజెపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి నఖ్వీ డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ కూడా నరేష్ అగర్వాల్ వాడిన పదం అన్ పార్లమెంటరీ అని ప్రకటించారు. రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు.