దేశం కోసం ఎంతకైనా సిద్ధం: ఉగ్రవాదంపై రక్షణ మంత్రి పారికర్
ఢిల్లీ: భారత దేశాన్ని పరిరక్షించుకునేందుకు తాను ఎంతకైనా తెగిస్తాననీ, దాడి చేసే వారికి అదే తరహాలో బుద్ధి చెబుతామంటూ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.
‘నేను ప్రాథమికంగా నా దేశాన్ని సమర్థించుకోవాల్సి ఉంది. అందుకోసం ఎంతవరకైనా వెళతాను. చేయాల్సిందంతా చేస్తాను. ఒకవేళ కొందరు నా దేశానికి నష్టం కలిగించాలని భావిస్తే, నేను చురుగ్గానే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దాడిచేస్తే, వారిని ఎదుర్కొనడానికి సైన్యం ఉంది. దాడికి పాల్పడినవారికి అదేరూపంలో సమాధానం చెప్పాలి' అని పారికర్ పేర్కొన్నారు.
ఇప్పటికే తీవ్రవాదులను తీవ్రవాదులతో మాత్రమే తటస్థీకరించాలంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పారికర్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తీవ్రవాదానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వచ్చిన స్పందనల గురించి తనకు తెలుసన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీరులోని తీవ్రవాద శిబిరాలకు సంబంధించిన ప్రశ్నకు అది తన ప్రతిస్పందన అంటూ పారికర్ పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా చెప్పారు. పైగా, తటస్థీకరణ అనే మాటకు కేవలం అంతమొందించడమనే అర్థం కాదన్నారు. తీవ్రవాదుల లొంగుబాటునుద్దేశించి ఆ వ్యాఖ్య చేసినట్లు చెప్పారు.
తన వ్యాఖ్యల్లోని కొంతభాగాన్ని మాత్రం తీసుకుని దానికి బాగా ప్రచారం కల్పించారని పారికర్ వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడినవారు అదేస్థాయిలో నష్టపోక తప్పదన్నారు. తన వ్యాఖ్యలు ఏ ఒక్కరిని ఉద్దేశించి చేసినవి కాదన్నారు.