ఏం జరుగుతోంది?: వైఎస్ జగన్, కేసీఆర్ పనితీరుపై నరేంద్ర మోడీ అసహనం: వేస్ట్ ఎందుకంటూ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతోన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. వైరస్ వ్యాప్తి చెందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సమాచారాన్ని వారి వద్ద నుంచి సేకరించారు. వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదంటూ మోడీ హితవు పలికారు.
ఏపీ హెచ్ఆర్సీగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి: ఆంధ్రా యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్
ఏపీ, తెలంగాణ, యూపీల్లో వ్యాక్సిన్ వేస్ట్..
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ, ఏపీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యోగి ఆదిత్యనాథ్ పనితీరు పట్ల ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ పట్ల ఈ మూడు రాష్ట్రాల్లో వృధా అవుతోందని చెప్పారు. తెలంగాణ, ఏపీల్లో 10 శాతం వ్యాక్సిన్ వేస్ట్ అవుతోందనే సమాచారం తన వద్ద ఉందని మోడీ స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్లోనూ అదే స్థాయిలో వ్యాక్సిన్ వృధా అవుతోందని, ఈ పరిస్థితుల నుంచి నివారించాలని సూచించారు. వ్యాక్సిన్ ఎందుకు వృధా అవుతోందని సూటిగా ఆ ముగ్గురు ముఖ్యమంత్రులను ప్రశ్నించారు.
ప్రతి రోజూ సమీక్షించండి..
వ్యాక్సిన్ వృధాను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మోడీ అన్నారు. దీనికోసం ప్రతిరోజూ సాయంత్రం వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వ్యాక్సిన్ వేస్టేజీని అరికట్టడానికి వైద్యరంగంలో క్రియాశీలకంగా ఉండే అధికారులు, వ్యక్తులకు వాటి బాధ్యతను అప్పగించాలని సూచించారు. వ్యాక్సిన్ వృధాను అరికట్టడంపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం చేశారు. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువగా వ్యాక్సినేషన్ సాగుతోందని, టెస్టింగులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయని అన్నారు.
70 జిల్లాల్లో 150 శాతం మేరకు
దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వారాలుగా 150 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే.. దేశవ్యాప్తంగా అది విస్తరించడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో పాటు భారత్లోనూ వేర్వేరు దశల్లో వైరస్ విజృంభిస్తోందని, పాజిటివ్ కేసుల రేటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లల్లో అధికంగా ఉందని అన్నారు. నివారించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.
తక్షణమే అడ్డుకోవడం.. సమష్టి బాద్యత..
కరోనా వేవ్లను తక్షణమే అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని, దీన్ని ఉమ్మడిగా బాధ్యతగా గుర్తించాలని మోడీ అన్నారు. దీనికోసం శీఘ్రగతిన నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. వైరస్ ప్రభావం అన్ని దేశాలపైనా ఉందని, పేద-ధనిక, ఉత్తరం-దక్షిణం, తూర్పు-పడమర అనే తేడా ఏదీ లేదని అన్నారు. మరోసారి ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.