ఢిల్లీ పోలీసుల షాకింగ్ రిపోర్ట్: మొత్తం 16 వేల మందికి పైగా: వెన్నులో వణుకు పుట్టించే అంశాలు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణమైనట్లు అనుమానిస్తోన్న ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలపై అక్కడి పోలీసులు ఇచ్చిన తాజా నివేదిక.. వెన్నులో వణుకు పుట్టించే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ భవన సముదాయంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనల్లో 16 వేల మంది పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు తమ తాజా నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేశారు.
ఏప్రిల్ 13 నుంచి 24 మధ్య..
దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో మూడు రోజుల పాటు తబ్లిగీ జమాతీ సామూహిక మత ప్రార్థనలను నిర్వహించారు. మసీదు మతపెద్ద మౌలానా సాద్ సారథ్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనలకు దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండోనేషియా, మలేసియా వంటి పొరుగు దేశాల నుంచీ పెద్ద సంఖ్యలో ఇందుల పాల్గొన్నారు. ఇలా.. మార్చి 13 నుంచి 24 తేదీల మధ్య ఏకంగా 16 వేల మంది మర్కజ్ మత ప్రార్థనల్లో దశలవారీగా పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
మర్కజ్ హెడ్ క్వార్టర్స్లో యాక్టివ్ సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా..
నిజానికి- ఇదివరకు రెండు నుంచి మూడు వేల మంది వరకు ఈ ప్రార్థనల్లో పాల్గొని ఉండొచ్చంటూ ఢిల్లీ పోలీసులు అంచనా వేశారు. అనంతరం దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగించిన అనంతరం పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి చెందని వారు మొత్తం 1000 మంది మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారని తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ వెయ్యిమంది సెల్ఫోన్ కాల్ డీటెయిల్స్ను విశ్లేషించగా.. 15 వేల మందికి వేర్వేరుగా ఫోన్లు చేశారని, వారందరి సెల్ఫోన్ సిగ్నళ్లను అధ్యయనం చేయగా.. మార్చి 13 నుంచి 24వ తేదీ మధ్య మర్కజ్కు వచ్చినట్లు తేలిందని స్పష్టం చేశారు.
ఖాళీ చేయించడానికి అయిదు రోజులు..
మర్కజ్ మసీదు భవన సముదాయాన్ని ఖాళీ చేయించడానికి ఢిల్లీ పోలీసులకు మూడు రోజులు పట్టిన విషయం తెలిసిందే. మార్చి 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సుమారు 2,300 మందిని ఖాళీ చేయించారు. వారందర్నీ క్వారంటైన్లకు పంపించారు. అప్పటికే మర్కజ్ నుంచి వందలాది మంది తమ స్వస్థలాలకు తరలి వెళ్లారని ఢిల్లీ పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. తెలంగాణలోని కరీంనగర్లో ఎనిమిది ఇండోనేషియన్లకు కరోనా వైరస్ సోకడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేసినట్లు సమాచారం. తబ్లిగి జమాత్ సమావేశాన్ని నిర్వహించిన మౌలానా సాద్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.