సివిల్ ఆస్పత్రి నుంచి 1700 కరోనా వ్యాక్సిన్లు చోరీ: నగదునూ ముట్టుకోని దొంగలు
ఛండీగఢ్: దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతతో పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ మార్కెట్ విక్రయాలు కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. తాజాగా, హర్యానా రాష్ట్రంలో 1700కుపైగా కరోనా వ్యాక్సిన్లు అపహరణకు గురయ్యాయి.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసుల చోరీ.. నగదును ముట్టుకోలేదు..
హర్యానాలోని జింద్ సివిల్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 1270 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు, 440 కోవాగ్జిన్ డోసులు ఆస్పత్రి నుంచి చోరీకి గురయ్యాయని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజేందర్ సింగ్ తెలిపారు. నిందితులు ఆస్పత్రిలోని ఇతర మందులు గానీ, నగదును గానీ ముట్టుకోకపోవడం గమనార్మం.
ఉదయం వచ్చి చూసేసరికి.. వ్యాక్సిన్లు మాయం
గురువారం ఉదయం స్టోర్ రూం లాక్ తీసి ఉండటం, డీప్ ఫ్రీజర్ పగలగొట్టబడి ఉండటాన్ని చూసిన ఓ శానిటైజర్ వర్కర్ ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు.అయితే, కొన్ని వ్యాక్సిన్లు అపహరణకు గురైనప్పటికీ.. తగినన్నీ వ్యాక్సిన్లు నిల్వ ఉన్నాయని జింద్ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం వరకు అదనంగా మరో 1000 కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
6వేల కోవిషీల్డ్ డోసులు ఈ సాయంత్రానికి ఆస్పత్రికి చేరుకుంటాయన్నారు. వ్యాక్సిన్ల చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు దర్యాప్తు సవాలుగా మారింది.
హర్యానాలో లాక్డౌన్ తరహా ఆంక్షలు
కాగా, హర్యానాలో గత 24 గంటల్లో 9623 కరోనా కేసులు నమోదు కాగా, 45 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,81,247కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,528 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం హర్యానాలో 55,422 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3,22,297 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో రికవరీ రేటు 84.54 శాతంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ తరహాలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. మాస్కులు, భౌతిక దూరం లాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు స్పష్టం చేసింది.