23శాతం ఢిల్లీ నివాసితుల్లో కరోనావైరస్ యాంటీబాడీస్ ఉన్నాయి: సర్వే
ఢిల్లీ: కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ సెరో-సర్వే తమ స్టడీ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడ నివాసితుల్లో IgG యాంటీబాడీస్ 23.48శాతం ఉందని వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్లో ఈ స్టడీని నిర్వహించింది. చాలామందికి కరోనావైరస్ సోకినప్పటికీ ఈ యాంటీ బాడీస్ ఉండటం వల్ల లక్షణాలు కనిపించడం లేదని నివేదిక వెల్లడించింది. 27 జూన్ నుంచి 10 జూలై 2020 వరకు చేసిన సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.
21,387 శాంపిల్స్ సేకరించి ల్యాబుల్లో టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్టుల ద్వారా ఢిల్లీలోని ప్రజల్లో ఏమేరకు యాంటిబాడీస్ ఉన్నాయనే విషయం బయలుపడింది. యాంటిబాడీస్ టెస్టులను తరచూ చేయడం వల్ల వైరస్ వ్యాప్తి ఒక సమయం నుంచి మరో సమయం వరకు ఏమేరకు వ్యాప్తి చెందుతుందో తెలుస్తుంది. ఇక ఢిల్లీ విషయానికొస్తే మొత్తం 11 జిల్లాల్లో బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహించాయి. ఎంపిక చేయబడ్డ వారిలో నుంచి రక్తనమూనాలు సేకరించడం జరిగింది. ఇందుకోసం వారి నుంచి ముందస్తు అనుమతి కోరినట్లు సర్వే సంస్థ తెలిపింది.
వారినుంచి సేకరించిన రక్తనమూనాల్లోని సెరాను IgG యాంటీబాడీస్ పరీక్షలు చేశారు. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సూచించిన కోవిడ్ కవచ్ ఎలీసాను వినియోగించారు. ఎలీసా టెస్టింగ్ ద్వారా ఈ స్థాయిలో పరీక్షలు చేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఢిల్లీ సెరో సర్వే వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
మహమ్మారి దేశంలోకి ప్రవేశించి ఆరునెలలు కావొస్తోంది. 23.48శాతం మంది మాత్రమే ఢిల్లీలో ఈవ్యాధి బారిన పడ్డారని పేర్కొంది. అయితే ఇంకా కొందరు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వెల్లడించింది. కాబట్టి కంటెయిన్మెంట్ జోన్లను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సర్వే వెల్లడించింది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం అదే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.