Padma Awards 2026 :పద్మ పురస్కారాల్లో 'దక్షిణాది'హవా - రాజకీయ కోణం ఉందా?
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాల (Padma awards 2026) జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు విశేష ప్రాధాన్యత లభించిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ప్రముఖులకు ఈ గౌరవం దక్కడం వెనుక బలమైన రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 131 పద్మ పురస్కారాల్లో (Padma awards 2026) ఈసారి దక్షిణాది రాష్ట్రాల వ్యక్తులు మెరిశారు. పద్మ విభూషణ్ నుంచి పద్మశ్రీ వరకు ప్రధాన అవార్డుల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల రాష్ట్రాలపై 'పద్మ' ముద్ర?
ఈ ఏడాది తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని బలమైన సామాజిక వర్గాలకు లేదా ప్రజాదరణ కలిగిన వ్యక్తులకు పద్మ పురస్కారాలు ప్రకటించడం ద్వారా కేంద్రం అక్కడి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేరళకు 'విభూషణ్' వెలుగు:
ఈ ఏడాది ప్రకటించిన 5 పద్మ విభూషణ్ అవార్డులలో ఏకంగా 3 కేరళకే దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది.కేరళలో బలమైన వామపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్కు మరణానంతరం 'పద్మ విభూషణ్' ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేరళలోని మధ్యతరగతి మరియు వామపక్ష సానుభూతిపరుల మనసు గెలవడానికి వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మ భూషణ్ ప్రకటించడం వెనుక ఆ రాష్ట్ర సినీ అభిమానులను ఆకట్టుకునే వ్యూహం ఉందన్నది కాదనలేని వాస్తవం.వీరితో పాటు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె.టి. థామస్,ప్రముఖ జర్నలిస్ట్ పి.నారాయణన్లకు పద్మ పురస్కారాలు దక్కాయి.
తమిళనాడులో సామాజిక సమతుల్యత:
మహారాష్ట్ర (15) తర్వాత అత్యధికంగా 13 అవార్డులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది.ఇందులో వైద్యం, శాస్త్ర సాంకేతికం మరియు కళారంగాల వారికి అవకాశం కల్పించారు.పద్మ భూషణ్ విభాగంలో డాక్టర్ పళనిస్వామి, పారిశ్రామికవేత్త మైలానందన్ ఎంపికయ్యారు. అలాగే క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది. డీఎంకే బలంగా ఉన్న ఈ రాష్ట్రంలో, కేంద్రం తన ఉనికిని చాటుకోవడానికి ఈ పురస్కారాలను ఒక వేదికగా ఉపయోగించుకుందని తెలుస్తోంది.
బెంగాల్లో పట్టు కోసం
అటు పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు ఉండటంతో, అక్కడ 11 మందికి పురస్కారాలు అందజేశారు. ముఖ్యంగా బెంగాలీ సూపర్ స్టార్ ప్రోసెన్జిత్ ఛటర్జీకి పద్మశ్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఏటా పద్మ పురస్కారాల ఎంపికలో కొంత రాజకీయ ప్రాధాన్యతలు ఉండటం సహజమే. అయితే, ఈసారి ఎన్నికల ముంగిట ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ లక్ష్యాలను కూడా నెరవేర్చుకోవాలని చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ప్రతిభనే కాదు.. ప్రాంతీయ భావోద్వేగాలను, సామాజిక సమీకరణాలను కూడా పద్మ పురస్కారాలు ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం "అన్ సంగ్ హీరోస్" (గుర్తింపు లేని యోధులు) వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని మాత్రమే పారదర్శకంగా ఎంపిక చేశామని చెబుతోంది.












Click it and Unblock the Notifications