బోర్డర్ లో పాక్ ఆర్మీ: యుద్ధ వాతావరణం !
శ్రీనగర్: పాక్ బలగాలు భారత సరిహద్దు వరకు వచ్చేశాయి. బుధవారం వచ్చిరాగానే సైనిక విన్యాసాలు చేస్తూ భారత్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాయి. పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్ పూర్ పట్టణం సమీపంలో పాక్ తన సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది.
పాకిస్థాన్ సైనిక విన్యాసాలు చేస్తుంటే అక్కడికి ఆదేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ విన్యాసాలు తిలకించడానికి పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కూడా అక్కడికి వచ్చారు.
భారతదేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలోనే పాక్ తన ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ బలగాలను సిద్దం చేసేందుకు ఈ విన్యాసాలు చేపట్టిందని పాక్ మీడియా అంటున్నది. సైనిక విన్యాసాలతో పాటు హెలికాప్టర్ గన్ షిప్పులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఇటీవల ఎల్ వోసి (నియంత్రణ రేఖ) వద్ద భారత్ బలగాలు ఏడుగురు పాక్ సైనికులను అంతం చేసిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో పాక్ సరిహద్దులో సైనిక విన్యాసాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మా సహనాన్ని చేతకానితనంగా భారత్ భావించరాదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పటికే చెప్పారు. మాకు శక్తి ఉందని ఏమైనా చేస్తాం అని నవాజ్ షరీఫ్ పరోక్షంగా హెచ్చరించారు.
భారత ఆర్మీ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాక్ ఉగ్రవాదులు అంతం అయ్యారు. అప్పటి నుంచి పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే కాల్పులు జరపడంతో అనేక మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసిందే.