అది పాకిస్తాన్ కాదు.. టెర్రరిస్థాన్: ఐక్యరాజ్యసమితిలో చీల్చి చెండాడిన ఇండియా
ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ను చీల్చి చెండాడింది ఇండియా. అది స్వచ్ఛమైన ఉగ్రవాద నేల అని, అది పాకిస్థాన్ కాదు టెర్రరిస్థాన్ అని ఘాటుగా స్పందించింది.
జెనీవా: ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ను చీల్చి చెండాడింది ఇండియా. అది స్వచ్ఛమైన ఉగ్రవాద నేల అని, అది పాకిస్థాన్ కాదు టెర్రరిస్థాన్ అని ఘాటుగా స్పందించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రైట్ ఆఫ్ రిైప్లె కింద పాకిస్తాన్కు దిమ్మదిరిగే సమాధానమిచ్చింది.
పాకిస్తాన్ ఇప్పుడు టెర్రరిస్థాన్. అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాదం వర్ధిల్లుతోంది అని ఇండియా ఆరోపించింది. ఉర్దూలో పాక్ అంటే స్వచ్ఛమైనది అని అర్థం. కానీ అందుకు తగినట్లు ఉండటం ఆ దేశం ఎప్పుడో మరచిపోయింది. ఇప్పుడు పాక్ అనే పదం ఉగ్రవాదానికి నిర్వచనంలా మారిపోయింది అని స్పష్టంచేసింది.
ఐక్య రాజ్య సమితికి భారత్ తొలి కార్యదర్శి ఈనమ్ గంభీర్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు. పాకిస్తాన్ తనకున్న కాస్త చరిత్రలోనే అంతర్జాతీయ ఉగ్రవాదానికి మారుపేరుగా మారింది అని ఈనమ్ వ్యాఖ్యానించారు. గురువారం ఇదే జనరల్ అసెంబ్లీ వేదికగా తన తొలి ప్రసంగాన్ని వినిపించిన పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీకి భారత్ శుక్రవారం బదులిచ్చింది.
#WATCH: India hits out at Pakistan calling it 'Terroristan'-with a flourishing industry producing & exporting global terrorism #UN #Geneva pic.twitter.com/nmFlvBeVM1
— ANI (@ANI) September 22, 2017
తన ప్రసంగంలో ఉగ్రవాదాన్ని సమర్థించడంతోపాటు మరోసారి కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు పాక్ ప్రధాని అబ్బాసీ. కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఓ కమిషన్ను కశ్మీర్కు పంపించాలని కోరారు.
అయితే ఇండియా దీనిని గట్టిగానే తిప్పికొట్టింది. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల దాడిని తప్పించుకునేందుకు కశ్మీర్ అంశాన్ని పాక్ పదేపదే లేవనెత్తుతోందని ఇండియా ఆరోపించింది. ''లాడెన్, ముల్లా ఒమర్లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన దేశమే తాము బాధితులమని ఏడవడం దారుణం. పాక్ తీరేంటో దాని పొరుగు దేశాలన్నింటికీ తెలుసు..'' అని ఈనమ్ స్పష్టంచేశారు.
ఇక ఉగ్రవాదులు స్వేచ్ఛగా రోడ్లపై తిరిగే ఓ విఫల రాజ్యం నుంచి ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని ఈనమ్ ఘాటుగా స్పందించారు. ఈ రకంగా కశ్మీర్లో పాక్ జోక్యాన్ని సహించేది లేదని మరోసారి అంతర్జాతీయ వేదికగా తేల్చి చెప్పింది భారత్.