ఉగ్రవాదులు: చొరబాటుకు పాతపద్దతే మంచిదట ?
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు కొత్త పద్దతిలో భారత్ లో చొరబడకూడదని నిర్ణయించుకున్నారు. దశాబ్ధాల క్రితం ఎలా భారత్ లోకి ప్రవేశించారో ఇప్పుడు మళ్లీ అలాగే పాత పద్దతిలో భారత్ లోకి ప్రవేశించాలని ప్లాన్ వేసుకుంటున్నారని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి.
ఈ విషయం తెలుసున్న భారత భద్రతా దళాలు ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారత్ లోకి ఎలా ప్రవేశించాలి ? అని ఆలోచిస్తున్న ఉగ్రవాదులు ఇప్పుడు కూడాపాతపద్దతే మంచిదని నిర్ణయించారని తెలిసింది.
పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత మన దేశంలో చొరబడటానికి ప్రయత్నించిన ఐదు మందిని అరెస్టు చేశారు. అనేక సంవత్సరాల క్రితం ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశిస్తున్న మార్గాల్లోనే ఇప్పుడు ఈ ఐదు మంది ప్రవేశించారని ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించడానికి వీలు కల్పించడానికి పాక్ సైన్యం భారత సైనిక శిభిరాల మీద కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని, అదే సమయంలో ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్ననారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భారత భద్రతా దళాల వివరాల ప్రకారం 87 మంది విదేశీ ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని కొన్ని నెలల క్రితం భారత భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. ఈ సంవత్సరంలో 87 విదేశీయులతో సహ 128 మంది ఉగ్రవాదులను జమ్మూ, కాశ్మీర్ లో అంతం చేశారు.
అందులో 120 మందిని భారత భద్రతా దళాలు అంతం చేశాయి. మిగిలిన 8 మందిని స్థానిక పోలీసులు, సీఆర్ పీఎఫ్ సిబ్బంది కాల్చి చంపారు. 2015లో 70 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నిస్తే వారిని అంతం చేశారు.
జమ్మూ, కాశ్మీర్ లో స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు యువకులను వలలో వేసుకోవడానికి పాక్ ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు సమాచారం సేకరించారు. కాశ్మీర్ లోయలో స్థానికంగా యువకులకు మంచి పరిచయాలు ఉండటంతో ఎలాగైనా దాడులు చేయించాలని ప్లాన్ వేస్తున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.