పళని, పన్నీర్ మధ్యలో వైద్యలింగం..! నేతల మద్య గ్యాప్ పెంచుతున్న వైనం..!!
చెన్నై/హైదరాబాద్ : చెన్నై రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనంతరం పరిణామాలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య గ్యాప్ ను పెంచాయి. పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్య సమాలోచనలు జరుపుతుండటం పళనిస్వామికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు రాఘవేంద్రకు కేంద్రమంత్రి పదవి కోసం పన్నీర్ సెల్వం ప్రయత్నించడాన్ని పళనిస్వామి వర్గం తప్పుపడుతోంది.
అందుకే ఆయనకు పోటీగా పళనిస్వామి వర్గం రాజ్యసభ సభ్యుడు వైద్యలింగం పేరును కేంద్ర మంత్రి పదవికి తెరమీదకు తెచ్చింది. దీంతో ఎవరికీ కేంద్ర మంత్రివర్గంలో సీటు దక్కలేదు. దీంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ఇద్దరూ ఒకరికొకరు పై చేయి సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని పళనిస్వామి అనుమానిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రాజన్ చెల్లప్పన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యంపోశాయి.జయలలితకు నమ్మకమైన వ్యక్తికే పాలన పగ్గాలు అప్పగించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు పన్నీర్ సెల్వంను ఉద్దేశించి చేసినవేనంటున్నారు పళనిస్వామి సన్నిహితులు.

దీంతో ఇద్దరి నేతల మధ్య విభేదాలు పొడసూపాయంటున్నారు. ముఖ్యంగా తన కుమారుడిని రాజకీయంగా ఎదగనీయకుండా పళనిస్వామి అడ్డుపడుతున్నారని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. ఒకదశలో పన్నీర్ సెల్వం బీజేపీలో చేరతారన్న ప్రచారమూ జరిగింది. అయితే దానిని ఆయన ఖండించారు. ఈ పరిస్థితిల్లో త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నిక కానున్నారు. శానససభలో బలాబలాల ప్రకారం అన్నాడీఎంకే కు మూడు, ప్రతిపక్ష డీఎంకే కు మూడు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ వారికే పదవులు ఇప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. వీరితో పాటు మిత్రపక్షాలైన పీఎంకే వంటి పార్టీలు కూడా రాజ్యసభ స్థానాలను కోరుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనేక మంది ఓటమి పాలు కావడంతో రాజ్యసభ పదవికి పోటీ పెరిగింది. దీంతో వీరిద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగే అవకాశముందని అధికార అన్నాడీఎంకేలో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications