కర్ణాటక: KGFలో మరో సంచలనం.. బంగారాన్ని మించిన పల్లాడియం నిక్షేపాలు.. త్వరలోనే వెలికితీత..
దాదాపు రెండో దశాబ్దం నుంచీ బంగారం తవ్వకాలకు కేంద్రంగా.. దేశంలోనే మొట్టమొదట విద్యుత్ సరఫరా కలిగిన ప్రాంతంగా.. ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన కల్పతరువుగా ప్రసిద్ధికెక్కాయి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఈ ప్రాంతం నేపథ్యంలో వచ్చిన 'కేజీఎఫ్' సినిమా సైతం అందరినీ ఆకట్టుకుంది. ఇండిపెండెన్స్ తర్వాత కేజీఎఫ్ ను ష్యూరిటీగా చూపించి నాటి ప్రధాని నెహ్రూ ప్రపంచబ్యాంకు నుంచి రుణం పొందినట్లుగానూ ప్రచారంలో ఉంది. వేల ఏళ్లుగా టన్నులకొద్దీ బంగారం తోడేయడంతో నిక్షేపాలు తరిగిపోయాయి. అయితే ఇప్పటికీ కేజీఎఫ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారం ఇతర విలువైన లోహ నిక్షేపాలు ఉన్నట్లు తరచూ రిపోర్టులు వస్తుండటంతో కేంద్రం కూడా సర్వేలు చేయించింది. ఆ ఫలితాలకు సంబంధించి కోలార్ బీజేపీ ఎంపీ మునిస్వామి తాజాగా సంచలన ప్రకటన చేశారు.

స్థానికుల డిమాండ్..
కోలార్ గనుల్లో బంగారం నిక్షేపాలు మరీ లోతులో ఉండటం, రాబడితో పోల్చుకుంటే ఖనిజ తవ్వకాలకు అవుతోన్న ఖర్చు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం 2001లోనే గనులను మూసేసింది. కాగా, వేల మందికి ఉపాధి కల్పించే ఆ గనులను తిరిగి తెరవాలంటూ స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కోలార్ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ‘గనుల రీ ఓపెనింగ్' ప్రాధానాంశంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం కోలార్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మునిస్వామి.. స్థానికులకు గుడ్ న్యూస్ చెప్పారు.

విలువైన పల్లాడియం..
భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్(బీజీఎంఎల్) ఆధీనంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉండగా.. ఆ సంస్థ పునరుజ్జీవనానికి సంబంధించి మాజీ కార్మికులను వెంటేసుకుని ప్రధాని మోదీని కలిశానని, ప్రధాని సూచనల మేరకు కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్జోషి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైందని, నిపుణులతో కూడిన ఆ కమిటీ.. కేజీఎఫ్ లోని నిక్షేపాల నమూనాలను సేకరించి, ల్యాబ్ కు పంపగా.. బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడైందని ఎంపీ మునిస్వామి వివరించారు. మంగళవారం బెంగళూరు సిటీలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాలను వెల్లడించారు.

త్వరలో వెలికితీత..
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో విలువైన పల్లాడియం నిక్షేపాలు ఉన్నాయని రూఢీ కావడంతో దాని వెలికి తీతపై కేంద్ర సర్కారు దృష్టిసారించినట్లు స్థానిక ఎంపీ తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో గనుల్లో పనులు రీస్టార్ట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన తుది నిర్ణయం, విధివిధానాలు ఖరారయ్యే అవకాశముందని ఆయన చెప్పారు. తద్వారా కోలార్ ప్రాంతంలో మళ్లీ వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.

కేజీఎఫ్ రూపు మారుతోంది..
బీజీఎంఎల్ ఆధ్వర్యంలోని కేజీఎఫ్ కు చెందిన 12600 ఎకరాల ప్రాంతాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్(ఎస్ఈజెడ్)గా మార్చేసి, అక్కడ సోలార్ ఉపకరణాల తయారీ చేపట్టేందుకు కర్నాటక సర్కారు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని, ఆ క్రమంలోనే కేజీఎఫ్ లో రైల్వే వర్క్ షాప్ కూడా నెలకొల్పుతామని, రూ.485 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వర్క్ షాప్ నిర్మాణం 2022నాటికి పూర్తయ్యే అవకాశముందని, కేజీఎఫ్ కు కృష్ణా జలాలను తరలించే పథకానికి కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని ఎంపీ మునిస్వామి వివరించారు.

పల్లాడియం అంటే
ప్లాటినం గ్రూపు లోహాలకు చెందిన పల్లాడియం చూడటానికి వెండి రంగులో ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతకే కరుగుతుంది. ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తున్నందున లోహంగా ఇది గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నా ప్రపంచ డిమాండుకు సరిపోవడం లేదు. దీని గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే ఎక్కువే.












Click it and Unblock the Notifications