గవర్నర్తో భేటీ: నవ్వుతూ పన్నీర్, మీడియాకు మొహం చాటేసిన శశికళ
గవర్నర్ను ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళ కలిశారు. గవర్నర్ను కలిసిన తర్వాత వారిద్దరిలో కనిపించిన ఆశానిరాశలు పరిస్థితిని తెలియజేస్తున్నాయా...
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు చేతికి చేరాయి. బంతి ఆయన కోర్టులో చేరింది. ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళ ఆయనను కలిసి, తమ తమ వాదలు వినిపించారు. వారితో విద్యాసాగర రావు ఏం చెప్పారనే విషయం తెలియదు. కానీ విద్యాసాగర రావును కలిసిన తర్వాత పన్నీర్ మొహంలో ఆనందం తాండవమాడగా, శశికళ ముఖంలో ఆ ఉత్సాహం కనిపించలేదు. అయితే అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించే ప్రయత్నం చేశారు.
గవర్నర్ను కలిసిన తర్వాత పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు. ఆయన నవ్వుతూ కనిపించారు. ధర్మమే గెలుస్తుందని చెప్పారు. తాను గవర్నర్కు చెప్పిన విషయాలను మీడియాకు వివరించారు. త్వరలోనే శుభవార్త చెబుతానంటూ ఆయన మీడియా సమావేశాన్ని ముగించారు.

కాగా, అన్నాడియంకె శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ గురువారం సాయంత్రం గవర్నర్ విద్యాసాగర రావును కలిశారు. తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేల సంతకాలున్న లేఖను ఆమె గవర్నర్కు సమర్పించారు. గవర్నర్తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఆమె ముఖంలో టెన్షన్ కనిపించింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శశికళ గవర్నర్ను కోరారు. శాసనసభలో బల పరీక్ష అక్కర లేదని ఆమె చెప్పారు. తనకు అవకాశం ఇవ్వకపోతే రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమని చెప్పారు.
భేటీ అనంతరం పన్నీరు సెల్వంలో ఉన్న చిరునవ్వుకానీ, ఉత్సాహం కానీ ఆమెలో కనపడలేదు. మీడియా ప్రతినిధులు మాట్లాడండి మేడమ్ అని వాహనాన్ని అడ్డగించినా ఆమె మాట్లాడలేదు. దీన్ని బట్టి గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications