చివరి నిమిషంలో చేతులు ఎత్తేసిన పన్నీర్ సెల్వం: రాజీనామా చేస్తేనే !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గీయుల భేటీని రద్దు చేశారు, పన్నీర్ సెల్వం మరో ఎత్తు వేసి ఎడప్పాడి పళనిసామి వర్గీయులను అయోమయానికి గురి చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎలాగైనా శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ పదవుల నుంచి తప్పించి, ప్రభుత్వంలో పెత్తనం చెయ్యకుండా చూడాలని పన్నీర్ సెల్వం వేసిన స్కెచ్ వంద శాతం ఫలించింది.
పన్నీర్ సెల్వం తాజాగా మరో ఎత్తు వేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఖర్చీతో సహ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలని బుధవారం మరో రెండు డిమాండ్లను ఎడప్పాడి పళనిసామి వర్గం ముందు పెట్టారు. బుధవారం సాయంత్రం ఇరు వర్గాలు భేటీ అయ్యి చర్చించాలని తీర్మానించారు. అయితే పన్నీర్ సెల్వం మరో స్కెచ్ వేసి ఎడప్పాడి పళనిసామి వర్గాన్ని ఇరకాటంలో పెట్టారు.
రాజీనామా చెయ్యను
టీటీవీ దినకరన్ తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నానని బుధవారం మీడియాకు చెప్పారు. మంగళవారం నుంచి పార్టీ బాధ్యతలు చూడటం లేదని అన్నారు. అయితే తాను ఇప్పుడే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చెయ్యనని తేల్చి చెప్పారు.
అందుకే వద్దంటున్నారా
అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా తనను శశికళ నియమించారని, బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న చిన్నమ్మతో చర్చించిన తరువాత తన పదవికి రాజీనామా చేస్తానని దినకరన్ ప్రకటించారు.
వెళ్లిపోతేనే అంటున్న పన్నీర్ సెల్వం
టీటీవీ దినకరన్ స్వయంగా అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామ చేసి వెళ్లిన తరువాతే ఎడప్పాడి పళనిసామి వర్గీయులతో చర్చించాలని పన్నీర్ సెల్వం చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారని వెలుగు చూసింది.
వాయిదా వేసింది అందుకేనా
బుధవారం సాయంత్రం పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గం భేటీ అయ్యి చర్చిస్తారని, ఆ సమయంలో ఇరువర్గాల విలీనంపై తుది నిర్ణయం తీసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పన్నీర్ సెల్వం ఇరువర్గాల భేటిని వాయిదా వేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించి
తన వర్గంలోని ఎంపీలు, ఎమ్మెలతో విడివిడిగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పన్నీర్ సెల్వం తీర్మానించారు బుధవారం ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహ తన వర్గంలోని పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు.
డేట్ ఫిక్స్ చేసిన ఓపీఎస్
గురువారం ఎడప్పాడి పళనిసామి వర్గీయులతో చర్చించి విలీనంపై తుది నిర్ణయం తీసుకోవాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. బుధవారం ఇరు వర్గాల భేటీని వాయిదా వెయ్యాలని భావించారు. శశికళ వర్గంలో ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీకూడా లేకుండా చెయ్యాలని పన్నీర్ సెల్వం పక్కాప్లాన్ చేస్తున్నారు.
మాట తప్పను అంటున్న పన్నీర్
శశికళ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడానికి ఎవ్వరితోనైనా సరే కలిసి పని చెయ్యడానికి తాను సిద్దం అంటూ పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఎడప్పాడి పళనిసామి సైతం తాము అన్నాడీఎంకే పార్టీని కాపాడుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గంతో కలవడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు.
రెండు వర్గాలు విలీనం
శశికళ ఫ్యామిలీని పార్టీ నుంచి వెలివెయ్యడంతో పన్నీర్ సెల్వం మరో స్కెచ్ వేసి రెండు వర్గాలు భేటీకి మరో రోజు వాయిదా వేశారు. మొత్తం మీద పన్నీర్ సెల్వం తను అనుకున్నవన్నీ పూర్తి చేసుకున్న తరువాతే రెండు వర్గాలు వీలినం గురించి అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారని తెలిసింది.