మంత్రి అనిల్ దేశ్ముఖ్పై వెంటనే సీబీఐ విచారణ జరిపించండి: హైకోర్టులో పరమ్ బీర్ సింగ్
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ విచారణ జరిపించాలని కోరతూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ముంబై నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు మంత్రి టార్గెట్ విధించడంపై పూర్తి దర్యాప్తు జరిపించాలని పిటిషన్లో కోరారు.
ఇంకా ఆలస్యం చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, అందుకే వీలైనంత తొందరగా నిష్పాక్షికంగా దర్యాప్తునకు ఆదేశించాలని బాంబై హైకోర్టుకు పరమ్ వీర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై తాను చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని పరమ్ బీర్ తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే, పరమ్ వీర్ సింగ్ ఆరోపణలన తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. ఈ విషయంపై బాంబే హైకోర్టును ఆశ్రయించాలని ఆయనకు సూచించింది. ఈ నేపథ్యంలోనే పరమ్ బీర్ సింగ్ బాంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సచిన్ వాజేతోపాటు ముంబైకి చెందిన చాలా మంది పోలీసు అధికారులతో హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఫిబ్రవరిలో వరుస మావేశాలు నిర్వహించారని పరమ్ బీర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ సమయంలోనే రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే దేశ్ముఖ్ వ్యవహార శైలిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టును పరమ్ బీర్ సింగ్ కోరారు. వీటిని ధృవపర్చేందుకు అనిత్ దేశ్ముఖ్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా వీలైనంత తొందరగా సేకరించేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరారు. ఓ వైపు పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు, మరోవైపు సచిన్ వాజే వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 100 కోట్ల వసూళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి అనిల్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే సీఎం ఉద్ధవ్ థాక్రే వీటన్నింటిని చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.