తల్లి, తండ్రి.. ఓ కొడుకు, కుటుంబమంతా ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు
కొడుకుతో కలిసి తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్న ఉదంతం పశ్చిమ్ బంగాలో చోటు చేసుకుంది.
కోల్ కతా: కొడుకుతో కలిసి తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్న ఘటన పశ్చిమ్ బంగాలో చోటు చేసుకుంది. నదియా జిల్లాకి చెందిన బిప్లాబ్ మోండల్ అనే యువకుడు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్న బిప్లాబ్ తో పాటు అతడి తల్లిదండ్రులు బలరాం, కల్యాణి కూడా పరీక్షలు రాయడం విశేషం. వివాహం కాకముందు బలరాం, కల్యాణి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు.
బలరాం పదో తరగతిలో, కల్యాణి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే వారిద్దరికీ పెళ్లి చేసేశారు. దాంతో ఇద్దరూ చదువు మానేయాల్సి వచ్చింది. వీరికి బిప్లాబ్ పుట్టినా కూడా అతడినీ చదివించలేని పరిస్థితి.

పాఠశాలకు పంపి చదివించే స్తోమత లేకపోవడంతో ట్యూషన్ పెట్టించి చదువు చెప్పించారు. అలా బిప్లాబ్ తాను నేర్చుకున్నవన్నీ తన తల్లిదండ్రులకి కూడా నేర్పించేవాడు. ఆ క్రమంలో అతడు పదో తరగతి పాసయ్యాడు.
ఈ మధ్యలో బలరాం.. భార్య కల్యాణితోపాటు తనూ పదో తరగతి పూర్తి చేశాడు. అనంతరం కుమారుడితో పాటు తామూ ఇంటర్ చదవాలని అనుకున్న ఆ దంపతులు అతడు చదువుతున్న కళాశాలకే వెళ్లి ప్రాధేయపడ్డారు. అక్కడి ప్రిన్సిపల్ సుజిత్ కుమార్ వారి విజ్ఞప్తిని మన్నించి వారిని కళాశాలలో చేర్చుకున్నారు.
అలా బలరాం, కల్యాణి.. తమ కుమారుడు బిప్లాబ్ తోపాటు ఇంటర్ చదివి ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నారు. ''తల్లిదండ్రులే నాకు స్నేహితులు. వారే నాకు సహ విద్యార్థులు కావడం అదృష్టంగా భావిస్తున్నా. అదీకాకుండా మా ముగ్గురివి ఒకే సబ్జెక్టులు, ఒకే సెంటర్ కూడా..'' అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు బిప్లాబ్.












Click it and Unblock the Notifications