పార్లమెంట్ నిరవధిక వాయిదా- షెడ్యూల్ కు ఒక్క రోజు ముందే-విపక్షాల నిరసనలతో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం రేపటితో సమావేశాలు ముగియాల్సి ఉండగా.. కేంద్రం మాత్రం ఒక్క రోజు ముందే వీటికి ముగింపు పలికింది. పార్లమెంట్ ఉభయసభల్లోనూ విపక్షాలు తరచూ నిరసనలకు దిగుతుండటం, కేంద్రం నచ్చజెప్పే పరిస్ధితులు లేకపోవడంతో కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసుకుని ఉభయసభల్ని నిరవధికంగా వాయిదా వేసేశారు.
ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాల 18వ రోజు ఇరుసభలూ ఉదయం సమావేశమయ్యాయి. అయితే విపక్షాల నిరసనలు కొనసాగాయి. అదే సమయంలో కేంద్రం కూడా కీలకమైన ఎన్నికల చట్టాల సవరణ సహా ఇతర బిల్లుల్ని ఇప్పటికే ఇరుసభల్లోనూ ఆమోదించుకోవడంతో ఇక సమావేశాలకు ముగింపు పలికేందుకే సిద్ధపడింది. దీంతో లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయా సభల్ని నిరవధికంగా వాయిదా వేసి వెళ్లిపోయారు.
ఈ సమావేశాల్లో భాగంగా మొత్తం 18 రోజులు ఇరుసభలు పనిచేశాయి. ఇందులో ప్రధానంగా కేంద్రం వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటూ ఆరంభంలో ప్రవేశపెట్టిన బిల్లులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా రైతులు ఏడాది కాలంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై వాటి ప్రభావం పడకుండా కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంది. మరోవైపు పలు కీలక బిల్లుల్ని కూడా కేంద్రం ఆమోదింపజేసుకుంది. ఇందులో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు, నార్కో డ్రగ్స్ బిల్లు, బాల్య వివాహాల నిషేధ చట్ట సవరణ బిల్లులు సహా పలు బిల్లుల్ని ఆమోదింపజేసుకుంది. అయితే విమర్శల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు.
అలాగే రాజ్యసభలో దుష్ప్రవర్తన పేరుతో 12 మంది ఎంపీల్ని ఛైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. వీరిలో కాంగ్రెస్, టీఎంసీ, శివసేన సభ్యులు ఉన్నారు వీరంతా కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్ బయట ధర్నా చేస్తూనే ఉన్నారు. వీరికి విపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. తాజాగా నిన్న టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ను సైతం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో సస్పెండైన ఎంపీల సంఖ్య 13కు చేరింది. కేంద్రం ఈ సస్పెన్షన్లను వెనక్కి తీసుకునేందుకు క్షమాపణ షరతు పెట్టడంతో ఈ వ్యవహారం విలువైన రాజ్యసభ కార్యకలాపాల సమయాన్ని వృథా చేసింది. ఇందులో కేంద్రం, విపక్షాలు ఇద్దరూ తగ్గకపోకపోవడంతో రాజ్యసభ నిరవధిక వాయిదా పడే వరకూ ఈ ప్రతిష్టంభన తప్పలేదు.