అట్టుడికిన పార్లమెంట్ ఉభయసభలు.. పలుమార్లు వాయిదా
ఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్దే వ్యాఖ్యలు, కుల్భూషణ్ జాదవ్ ఘటనల నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలకు దిగడంతో పార్లమెంట్ ఉభయ సభల్లో బుధవారం గందరగోళం ఏర్పడింది. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది.
ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే.. అనంత్కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. హెగ్దేను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ ఇదే విషయమై గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ 12 గంటలకు సభ ప్రారంభమైంది. కుల్భూషణ్ జాదవ్, అతడి కుటుంబసభ్యులతో భేటీపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే ప్రతిపక్షాలు మరోసారి నిరసన చేపట్టాయి. జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
కులభూషన్ జాదవ్ను వెంటనే భారత్కు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు మిగతా ప్రతిపక్ష నేతలు కూడా మద్దతు పలికారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జాదవ్ విషయమై గురువారం తాను ప్రకటన చేస్తానని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications