parliament session day 7 : 19 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్-ఇరుసభల్లోనూ రచ్చరచ్చ..
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై వారం రోజులు దాటిపోయినా ఇంకా కీలక బిల్లుల ఆమోదం కానీ, చెప్పుకోదగిన కార్యకలాపాలు కానీ సాగడం లేదు. నిన్న లోక్ సభలో నలుగురు విపక్ష ఎంపీల్ని సస్పెండ్ చేయడంతో దాని ప్రభావం ఇవాళ లోక్ సభ కార్యకలాపాలపై పడింది. అదే సమయంలో రాజ్యసభలో నిరసనకు దిగిన 19 మంది విపక్ష ఎంపీల్ని అధికార పక్షం సస్పెండ్ చేయించింది. దీంతో ఏడోరోజూ వృథా అయినట్లయింది.
పార్లమెంటు ఉభయసభలు ఉదయం సమావేశం కాగానే విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో ఇరుసభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. జీఎస్టీ స్లాబ్ ల మార్పు, ధరల పెంపు వంటి అంశాలపై విపక్షాల వాయిదా తీర్మానాల్ని ఇరుసభల్లోనూ సభాపతులు తిరస్కరించారు. దీంతో వాటిపై చర్చ కోరుతూ విపక్షాలు నిరసనకు దిగాయి. లోక్ సభలో నిన్న సస్పెండ్ చేసిన ఎంపీల విషయంలో పునరాలోచించాలని విపక్షాలు కోరాయి. అయినా అధికార పక్షం స్పందించలేదు.
మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ పునఃప్రారంభం కాగానే.. ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు వెల్లోకి రావడమేంటని సభాపతి ప్రశ్నించారు. అంతరాయం కొనసాగితే, రూల్ 256ని అమలు చేసి సభ్యుల పేర్లను చెప్పవలసి ఉంటుందని హెచ్చరించారు. అయినా ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూనే ఉన్నాయి. దీంతో సభ్యులను పేర్లతో పిలుస్తూ వారి స్ధానాల్లో కూర్చోవాలని కోరారు. వారు వెనక్కి తగ్గకపోవడంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రూల్ 256 ప్రకారం మిగిలిన వారం పాటు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ఎంపీలను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని సభాపతి ఆమోదించారు. దీంతో మౌసమ్ నూర్, డోలా సేన్, శాంతను సేన్, సుస్మితా దేవ్, నదీముల్ హక్, ఎంఎం అబ్దుల్లా, ఏఏ రహీమ్, ఆర్ గిరిరాజన్, కనిమొళి, వీ శివదాసన్ సహా మొత్తం 19 మంది సస్పెండ్ అయ్యారు. అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
కోవిడ్ వ్యాప్తి కారణంగా జనాభా గణన 2021, సంబంధిత క్షేత్ర కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చిందని హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. రాబోయే జనాభా గణన మొదటి డిజిటల్ సెన్సస్ అని హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలియజేశారు. ఇందులో డేటా సేకరణ కోసం మొబైల్ యాప్లను వాడనున్నట్లు వెల్లడించారు. అలాగే వివిధ జనాభా లెక్కల సంబంధిత కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం సెన్సస్ పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.
లోక్ సభలోనే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కుటుంబ న్యాయస్థానం (సవరణ) బిల్లు 2022 పరిశీలన, ఆమోదం కోసం సమర్పించారు. బిల్లును ప్రవేశపెడుతూనే సవరణ చిన్నదని ఈరోజే ఆమోదం పొందగలిగితే ఆదర్శంగా ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ న్యాయస్థానాల చట్టం కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తుంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో చట్టం అమలులోకి వచ్చే తేదీలను తెలియజేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ ఈ చట్టం ప్రకారం కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాయి. అయితే వాటికి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి నోటిఫికేషన్ను ఇంకా ఆమోదించలేదు. అందువల్ల, దాని చట్టపరమైన చెల్లుబాటును గతంలో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బిల్లు ఈ ముఖ్యమైన చట్టబద్ధతను రెండు రాష్ట్రాల్లోని కుటుంబ న్యాయస్థానాలకు విస్తరించింది. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అనంతరం బిల్లును లోక్ సభ ఆమోదిస్తుంది.