Parliament Roundup Today: విపక్షాల వాకౌట్లు-నార్కోటిక్స్, జడ్డీల బిల్లులపై ఇరుసభల్లో చర్చలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ కూడా ఇరుసభల్లోనూ విపక్షాలు గళమెత్తాయి. కీలక ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రయత్నించాయి. విపక్షాల నిరసనల్ని ఏమాత్రం పట్టించుకోని కేంద్రం తమ అజెండాలో అంశాలపై చర్చలు కొనసాగిస్తోంది.
లోక్ సభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ.. సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలో స్త్రీలపై ద్వేషాన్ని నింపేలా ఉన్న ఓ ప్రశ్నపై అభ్యంతరం లేవనెత్తారు. దేశంలో విద్యావిధానం పరిస్ధికి అద్దం పట్టేలా ఇది ఉందన్నారు. దీన్ని సీబీఎస్ఈ వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. సోనియా మాట్లాడిన కొద్ది గంటల్లోనే సీబీఎస్ఈ ఈ ప్రశ్నను వెనక్కి తీసుకుని, దానికి రాసిన అన్ని సమాధానాలకు పాజిటివ్ మార్కులు ఇస్తామని ప్రకటించింది.
అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. సస్పెండైన ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలని మరోమారు డిమాండ్ చేశాయి. దీనిపై వెంకయ్యనాయుడు స్పందించలేదు. ఎంపీలకు తమ చర్యలపై పశ్చాతాపం లేదని రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్ గోయల్ తెలిపారు. వారు క్షమాపణ చెప్పేవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.
అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభం కాగానే న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు .. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల జీతభత్యాల సవరణ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. ఇది 1954 నాటి హైకోర్టు జడ్డీల జీతభత్యాల చట్టానికి, 1958 నాటి సుప్రీంకోర్టు జడ్డీల జీతభత్యాల సవరణ చట్టానికి ఆమోదం తెలిపేందుకు ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లుల్లో సవరణలు చేస్తూ చట్టం చేయనున్నారు.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సమావేశమైన లోక్ సభలో కేంద్రం విపక్ష కాంగ్రెస్ ఎంపీ సీబీఎస్ఈ ప్రశ్నపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. అంతకుముందు, దిగువ సభ వాయిదా పడుతున్న సమయంలో, సోనియా గాంధీ ప్రకటనకు సమాధానం ఇవ్వాలన్న తమ డిమాండ్కు ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనగా కాంగ్రెస్ ఎంపీలతో పాటు భావసారూప్యత గల పార్టీల ఎంపీలు వాకౌట్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేశామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు.
అనంతరం లోక్ సభలో నార్కోటిక్స్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల సవరణ బిల్లును ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (సవరణ) బిల్లు, 2021 ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల (సవరణ) ఆర్డినెన్స్, 2021ని ఆమోదించడానికి ప్రవేశపెట్టారు. ఇందులో డ్రాఫ్టింగ్ లోపాన్ని సరిచేయడానికి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్, 1985ని బిల్లు సవరించింది. ఈ చట్టం మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలను (తయారీ, రవాణా మరియు వినియోగం వంటివి) నియంత్రిస్తుంది. దీనిపై లోక్ సభలో చర్చ జరుగుతోంది.
మరోవైపు తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు లోక్ సభలో నిరసనకు దిగారు. అటు రాజ్యసభలో ఏపీలోని వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపై కేంద్రాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్రం.. వెలుగొండ డీపీఆర్ ఇంకా అందలేదని సమాధానం ఇచ్చింది. లోక్ సభలో ఏపీ ఆర్ధిక పరిస్ధితిని ప్రస్తావించిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు.. రాష్ట్రం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్ధితుల్లో ఉందని, వెంటనే ఆదుకోవాలని కోరారు.
ఇవాళ పార్లమెంట్ హైలెట్స్
- పార్లమెంట్ ఉభయసభల ప్రారంభం
- పార్లమెంట్ ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమం
- రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతకు విపక్షాల పట్టు, వాకౌట్
- లోక్ సభలో సోనియా ప్రశ్నకు సమాధానంపై కాంగ్రెస్ పట్టు, వాకౌట్
- రాజ్యసభలో జడ్డీల జీతభత్యాల సవరణ బిల్లుపై చర్చ
- లోక్ సభలో నార్కోటిక్స్ నియంత్రణ చట్ట సవరణ బిల్లుపై చర్చ
- తెలంగాణలో 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసన
- ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలని లోక్ సభలో కేంద్రాన్ని కోరిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు