యువ ఎంపీలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ..!!
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ, రాజ్యసభ సమావేశం అయ్యాయి. ఉప రాష్ట్రపతిగా కొత్తగా ఎన్నికైన జగ్దీప్ ధన్కర్ రాజ్యసభ ఛైర్మన్గా బాధ్యతలను స్వీకరించారు. రాజ్యసభ ఛైర్మన్గా ఇదే ఆయనకు తొలిరోజు. మొత్తం 17 రోజుల పాటు ఉభయసభలు సమావేశం కానున్నాయి. మొత్తంగా 16 బిల్లులు ఆమోదం కోసం సభ సమక్షానికి రానున్నాయి.
మహిళల రిజర్వేషన్, జనాభా నియంత్రణ, పాత పింఛన్ విధానానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ- ఈ సమావేశాలకు గైర్హాజర్ కానున్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రను కొనసాగిస్తోన్నారు. ఈ కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరు కాలేకపోవచ్చు. చైనాతో సరిహద్దు వివాదం, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ సర్వర్లపై సైబర్ అటాక్.. వంటి పలు కీలక అంశాలు సభలో చర్చకు రానున్నాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ- మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. శీతాకాల సమావేశాలను ఫలపద్రం చేద్దామని అన్నారు. సభ కార్యకలాపాలను ఎలాంటి అంతరాయాలు కల్పించొద్దని కోరారు. కొద్దిరోజులుగా తాను దాదాపు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను అనధికారికంగా కలిశానని, సభ సజావుగా సాగడం వల్ల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని వివరించినట్లు తెలిపారు.
కొత్తగా ఎన్నికైన వారు, యువ ఎంపీలు సభలో జరిగే అన్ని చర్చల్లోనూ పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అన్ని అంశాలపైనా వారికి సమగ్రమైన అవగాహన కలగాలంటే తప్పనిసరిగా డిబేట్లు జరిగి తీరాల్సి ఉంటుందని అన్నారు. సభ వాయిదా పడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని అన్నారు. సభా కార్యకలాపాలు సక్రమంగా సాగట్లేదని, చర్చలు జరగట్లేదని యువ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మోదీ చెప్పారు.
యువ ఎంపీలు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం చర్చల్లో పాల్గొనడానికి అనుకూల వాతావరణాన్ని, అవకాశాలను కల్పించాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలను కోరారు. సభ కార్యకలాపాలు సజావుగా పనిచేయడం చాలా ముఖ్యమని, మోదీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా యువ ఎంపీలు ఇలా అంటున్నారు. ప్రతిపక్ష ఎంపీలు కూడా చర్చల్లో మాట్లాడటానికి అవకాశం రావట్లేదని, ఆయా పార్టీల సభాపక్ష నేతలు వారికి సహకరించాలని సూచించారు.