నేటి పార్లమెంట్ సమావేశాల హైలెట్స్-లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటనలు, రాజ్యసభలో నిరసనలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు విపక్షాల నిరసనల మధ్యే కొనసాగుతున్నాయి. ఇవాళ వరుసగా ముూడో రోజు ఉభయసభల్లోనూ విపక్షాలు నిరసన గళం వినిపించాయి. లోక్ సభలో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, మిగతా అంశాలపై ఇతర విపక్ష ఎంపీలు నిరసనలు కొనసాగించారు. అలాగే రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా విపక్షాలు నిరసన తెలిపాయి. అటు పార్లమెంటు బయట సస్పెండైన రాజ్యసభ ఎంపీలు నిరసనలు చేపట్టారు.
లోక్ సభలో విపక్షాల నిరసనల మధ్యే డ్యామ్ ల భద్రతా బిల్లు 2019ని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ప్రవేశపెట్టారు. దీనిపై ఆయన తన స్పందన కూడా తెలిపారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే 12 మంది ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్, లెఫ్ట్, ఆప్, డీఎంకే సహా విపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. వీరికి తోడు టీఆర్ఎస్ ఎంపీలతో పాటు కొందరు సభ్యులు సభ వెల్లోకి దూసుకెళ్లారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేయాలని ఇతర ప్రతిపక్షాలు కోరగా, ఆహార సేకరణపై జాతీయ విధానాన్ని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సభలో టీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించింది.
లోక్ సభలో ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇవాళ కృత్రిమ గర్భధారణలో జరుగుతున్న అక్రమాల్ని అడ్డుకునేందుకు వీలుగా రూపొందించిన కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. గర్భధారణ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై నియంత్రణ, నిఘాకు ఇది ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. దీనికి వైసీపీ సహా పలు పార్టీలు మద్దతు పలికాయి.
అటు రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ రద్దుతో పాటు పలు అంశాలపై విపక్ష నేతలు నిరసనలు తెలుపుతూ సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నారు. గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నాలుగు గంటల్లో ఎగువ సభ నాల్గవ సారి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ సమావేశమైన కొద్ది నిమిషాల తర్వాత రేపటికి ఛైర్మన్ వాయిదా వేశారు. ఉదయం నుంచి పార్లమెంటు బయట ధర్నా చేస్తున్న సస్పెండైన రాజ్యసభ ఎంపీలకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి. సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యను కోరినా ఆయన మాత్రం ఎంపీలు పశ్చాత్తాపం ప్రకటించకపోవడంతో సస్పెన్షన్ పై వెనక్కి తగ్గబోనని మరోసారి స్పష్టం చేశారు.
ఇవాళ పార్లమెంట్ హైలెట్స్
*- పార్లమెంటు శీతాకాల సమావేశాల నాలుగోరోజు ఉభయ సభలు ప్రారంభం
- లోక్ సభ, రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు, నిరసనలు
- రైతులకు కనీస మద్దతు ధర కోరుతూ లోక్ సభలో విపక్షాల నిరసనలు
- లోక్ సభలో ఆనకట్టల భద్రతా బిల్లును ప్రవేశపెట్టిన జల్ శక్తి మంత్రి షెకావత్
- కృత్రిమ గర్భధారణ కేంద్రాల నియంత్రణ, నిఘా బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి మాండవీయ
- థాన్యం కొనుగోళ్లు, జాతీయ ఆహార భద్రత విధానం కోరుతూ లోక్ సభలో టీఆర్ఎస్ నిరసనలు
- రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని కోరుతూ రాజ్యసభలో విపక్షాల నిరసనలు
- పార్లమెంటు బయట సస్పెండైన రాజ్యసభ ఎంపీల ధర్నా, పలు విపక్షాల మద్దతు
- నిరసనల మధ్య పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా