18 ఏళ్లకే ఎన్నికల్లో పోటీకి అవకాశం ? కేంద్రానికి సిఫార్సు! ఈసీ అభ్యంతరం?
భారత్ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల కనీస వయస్సు తగ్గింపుపై మరోసారి చర్చ జరుగుతోంది. కేంద్ర న్యాయశాఖకు చెందిన పార్లమెంటరీ స్ధాయి సంఘం ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల కనీస వయస్సుపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఇందులో ఎన్నికల్లో పోటీకి కనీస వయస్సును ప్రస్తుతం ఉన్న 25 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని సిఫార్సు చేసింది. దీంతో కేంద్రం కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించి వయస్సు తగ్గించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ లో జరిగే ఎన్నికల ప్రక్రియలో యువత విశ్వసనీయమైన మరియు బాధ్యతాయుతమైన రాజకీయ భాగస్వాములు కాగలరని, కాబట్టి లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే కనీస వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆలోపే ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది.

కనీసం 18 ఏళ్ల వయస్సు గల వారు పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలలో సభ్యులుగా ఉండటానికి అవసరమైన అనుభవం, పరిపక్వత కలిగి ఉండాలని ఆశించడం అవాస్తవికంగా ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రస్తుతం ఓ వ్యక్తి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు, అలాగే రాజ్యసభ లేదా రాష్ట్ర శాసన మండలిలో సభ్యునిగా పోటీ చేయాలంటే మాత్రం 30 సంవత్సరాలు తప్పనిసరి. కానీ పార్లమెంటరీ స్ధాయి సంఘం నివేదికలో పలు కీలక విషయాల్ని ప్రస్తావించింది.
పార్లమెంటులో సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్పై నియమించిన స్టాండింగ్ కమిటీ వయస్సును తగ్గించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు, యువతలో పెరుగుతున్న రాజకీయ స్పృహ, యువత ప్రాతినిధ్యంతో కలిగే ప్రయోజనాలు వంటి అనేక అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని పేర్కొంది. కానీ ఈసీ అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం ఏ చేస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications