పారికర్ రాకతో సీన్ ఇలా!: రాజ్యసభలో గందరగోళం, కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీగా..
నాదాలు చేశారు. ఈ సమయంలో కేంద్రమంత్రి ముఖ్తాస్ అబ్బాస్ నఖ్వి వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
న్యూఢిల్లీ: గోవా సీఎం మనోహర్ పారికర్ శుక్రవారం రాజ్యసభకు రావడంతో కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులకు ధీటుగా బీజేపీ సభ్యులు సైతం నినాదాలు చేయడంతో.. సభలో గందరగోళం రేగింది. కాంగ్రెస్ సభ్యులు సభ వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.
జీరో అవర్ సమయంలో మనోహర్ పారికర్ సభలోకి వచ్చారు. ఆయన రాకను గమనించిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, బీఏ హరిప్రసాద్ తమ స్థానాల్లో నిలుచునే నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలను తిప్పికొడుతూ మనోహర్ పారికర్ కు మద్దతుగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇరుపక్షాల గందరగోళంతో మధ్యలో కలగజేసుకున్న డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా కొనసాగుతుండగానే.. రాజీవ్ గౌడ, హుస్సేన్ దాల్వాయ్ తదితర కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి పారికర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కేంద్రమంత్రి ముఖ్తాస్ అబ్బాస్ నఖ్వి వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గోవా కాంగ్రెస్ ఇంచార్జీ దిగ్విజయ్ కు ధన్యవాదాలు తెలిపేందుకే పారికర్ సభకు వచ్చారని నఖ్వి అనడంతో కాంగ్రెస్ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా, పారికర్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు నఖ్వి వ్యాఖ్యలకు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు చేశారు. కాగా, ఇటీవలి గోవా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ నిలిచినప్పటికీ సమయస్పూర్తితో వ్యవహరించడంలో విఫలమై కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. అదే సమయంలో మిత్రపక్షాలను కలుపుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే అసంతృప్తితో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు పారికర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.