గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు కేన్సర్..అడ్వాన్స్డ్ స్టేజ్ లో: ధృవీకరించిన మంత్రి
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ 'అడ్వాన్స్డ్ స్టేజ్ కేన్సర్'తో బాధపడుతున్నారని స్పష్టమైంది. దీర్ఘకాలంగా ఆయన అనారోగ్యంతో ఉంటున్నారు. ఇదివరకు ఆయన అమెరికా సహా ఢిల్లీలోని ఎయిమ్స్, ముంబైలోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. చికిత్స తీసుకుంటూనే ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. నాసికంలో అమర్చిన చిన్న పైప్ ద్వారా అధికశాతం ఆహారాన్ని తీసుకుంటున్నారు.
ఆయన అనారోగ్యానికి గల స్పష్టమైన కారణం ఇంతవరకూ వెలుగు చూడలేదు. ఏ వ్యాధితో బాధపడుతున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఒకట్రెండు సందర్భాల్లో కారణాలు వెలుగు చూసినప్పటికీ.. దాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. తాజాగా- మనోహర్ పారికర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని తేలింది. అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉందని స్పష్టమైంది. మనోహర్ పారికర్ కేబినెట్ మంత్రి విజయ్ సర్దేశాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
విజయ్ సర్దేశాయ్ ఫార్వర్డ్ గోవా పార్టీకి చెందిన ఎమ్మెల్యే. బీజేపీతో పొత్తు పెట్టుకున్ని ఎన్నికల్లో పోటీ చేసింది. దీనితో ఆయనకు మంత్రి పదవి లభించింది. కీలకమైన టౌన్ ప్లానింగ్ శాఖ మంత్రిగా విజయ్ సర్దేశాయ్ కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి అడ్వాన్స్డ్ స్టేజ్ కేన్సర్ తో బాధపడుతున్నారని విజయ్ సర్దేశాయ్ వెల్లడించారు.
అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న కేన్సర్ తో బాధపడుతూ కూడా పారికర్.. ప్రజల కోసం పని చేస్తున్నారని అన్నారు. కొన్ని ఫైళ్లపై సంతకాలు పెట్టుకోవడానికి తాను పారికర్ వద్దకు వెళ్తున్నానని, తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పటికీ, వాటిని పూర్తిగా చదవిన అనంతరమే అనుమతి ఇస్తున్నారని చెప్పారు.
కేన్సర్ తమ రాష్ట్ర ఆశలను కూడా చిదిమేస్తుందేమోననే భయాందోళనలు ఉన్నాయని అన్నారు. సొంత పార్టీ బీజేపీకి చెందిన నాయకుడిని కానప్పటికీ..అయినప్పటికీ, తనకు పారికర్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అన్నింటికీ దేవుడు ఉన్నాడని, ఆయనకు కేన్సర్ ను ఎదిరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆదివారం కూడా పారికర్ వైద్య చికిత్స తీసుకున్నారు. ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న గోవా వైద్య కళాశాల, ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుట పడటంతో సాయంత్రానికి డిశ్చార్జి అయ్యారు.