సరైన టైంలో..: అద్వానీకి స్పీకర్ పోస్ట్, మోడీ కన్వీనర్?
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్న నేపథ్యంలో బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ సేవలను ఎలా వినియోగించుకోవాలనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. అద్వానీని సభాపతి స్థానంలో కూర్చుండబెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే నరేంద్ర మోడీని ఎన్డీయే కన్వీనర్గా చేసే అవకాశముంది.
అద్వానీ సేవలు ఎలా వినియోగించుకోవాలో తగిన సమయంలో నిర్ణయిస్తామని ఆ పార్టీ మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వాజ్ పేయి, అద్వానీ బిజెపి వ్యవస్థాపకులని, అద్వానీ మార్గదర్శకత్వం తమకు అవసరమని అన్నారు.

నితిన్ గడ్కరీ, పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, మరో నేత అరుణ్ జైట్లీలు బుధవారం అహ్మదాబాదులో నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా అద్వానీ సేవలను ఎలా వినియోగించుకుంటారనే అంశంపై ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు.
రాజ్నాథ్ సింగ్ తమ పార్టీ అధ్యక్షులని, నరేంద్రమోడీ తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అని అయితే అద్వానీ మార్గదర్శకం తమకు చాలా ముఖ్యమని చెప్పారు. రాజ్ నాథ్, మోడీల నాయకత్వంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
తన సేవలను పార్టీ ఎలా వినియోగించుకున్నా తాను సిద్ధమని గడ్కరీ చెప్పారు. తన ప్రాధాన్యత మొదట దేశానికి అని, రెండో ప్రాధాన్యత పార్టీకి అని, ఆ తర్వాతే తాను అన్నారు. అద్వానీకి స్పీకర్ పోస్ట్ ఇస్తారా అని ప్రశ్నిస్తే... అద్వానీ మార్గదర్శకత్వం తమకు అవసరమని, ఆయన సేవలు ఎలా వినియోగించుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications