బీజేపీ సంచలన నిర్ణయం: అంధేరీ తూర్పు ఉపఎన్నిక నామినేషన్ విత్ డ్రా
ముంబై: మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న జరగనున్న అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవంకులే సోమవారం తెలిపారు.
ముంబైలోని అంధేరీ తూర్పునకు జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేయడం లేదు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ముర్జి పటేల్.. తన నామినేషన్ను ఉపసంహరించుకుంటారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ స్పస్టం చేశారు.
అయితే, ఉపసంహరించుకోకుంటే ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. గతంలో కూడా పలు ఉపఎన్నికల్లో బీజేపీ పోటీ చేయలేదని చెప్పారు. కాగా, అంధేరీ తూర్పునకు జరిగే ఉపఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిని పోటీలో నిలపకుండా ఉండాలని కోరారు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే.
చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబం నుంచే అభ్యర్థి పోటీ చేస్తున్నందున ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయకుండా ఉంటే బాగుంటుందని రాజ్ థాక్రే బీజేపీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అంధేరీ తూర్పు ఉపఎన్నికలో పోటీ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినట్లు తెలుస్తోంది. అంధేరీ తూర్పు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన పార్టీ సిట్టింగ్ సీటు కావడం గమనార్హం.
ప్రస్తుతం శివసేన అభ్యర్థి రుతుజా లట్కే.. అంధేరీ ఈస్ట్ నుంచి బరిలో ఉన్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఆమెకు వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో దింపకూడదని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే నిర్ణయించారు. అంతేగాక, అభ్యర్థిని నిలబెట్టవద్దంటూ బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు.
మహారాష్ట్ర పాటిస్తోన్న సంప్రదాయాన్ని అనుసరించి తన విన్నపానికి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నానని, తద్వారా ప్రజా ప్రతినిధికి నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఇక సీఎం ఏక్నాథ్ షిండే వర్గం నుంచి కూడా ఇదే విన్నపం వచ్చింది. మరోవైపు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలపబోమని చెప్పారు. ఈ క్రమంలో రుతుజా లట్కే విజయం దాదాపు ఖాయమైపోయింది.