రేపు నరేంద్ర మోడీని కలవనున్న పవన్ కళ్యాణ్?
హైదరాబాద్/న్యూఢిల్లీ: ప్రముఖ టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుజరాత్ మఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలువనున్నారా? కావొచ్చునంటున్నారు. రేపు అంటే సోమవారం (మార్చి 17న) మోడీతో పవన్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే, దీని పైన ఇటు బిజెపి, అటు పవన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
రెండు రోజుల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ కాంగ్రెసు పార్టీ పైన దుమ్మెత్తి పోశారు. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన పవన్ తన ప్రసంగంలో కాంగ్రెసు పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చురకలు అంటించారు. అయితే, జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీని మాత్రం పల్లెత్తు మాట అనలేదు.
బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు తన పైన వ్యాఖ్యలు చేశారంటూ... వ్యక్తిగతంగా ఆయన పైన పవన్ స్పందించారు. అదే సమయంలో విభజన విషయంలో బిజెపిపై విరుచుకపడలేదు. పవన్ తన ప్రసంగంలో. కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావో అని నినదించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపిలు పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ ఎంట్రీపై తొలుత టిడిపి భయపడింది. ఆయన ప్రసంగం తర్వాత టిడిపి ఊపిరి పీల్చుకుంది. ప్రసంగంలో పవన్ కాంగ్రెసును టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో మోడీని పవన్ కలవనున్నారనే ప్రచారం సాగుతోంది.