దేశం అంతటా సిద్ధరామయ్య ఫార్ములా: రెడీ అవుతున్న లోక్సభ మేనిఫెస్టో
Siddaramaiah: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి.
ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం మినహాయిస్తే- మూడు చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా మారిందనేది బహిరంగ రహస్యం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. వంటి ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ విజయానికి బాటలు వేశాయి. మొదట ఈ గ్యారంటీలను ప్రకటించింది కర్ణాటకలో. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఈ ఫార్ములా తెలంగాణలో సక్సెస్ అయింది. పార్టీకి అధికారాన్ని అప్పగించింది.
ఇప్పుడు అదే సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. 2024 నాటి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చోటు కల్పించడం వెనుక ఉన్న లక్ష్యం ఇదే. సిద్ధరామయ్య మొదలు పెట్టిన ఈ ఫార్ములాను లోక్సభ ఎన్నికల్లోనూ ఉపయోగించే అవకాశాలు లేకపోలేదు.

మొత్తం 16 మందితో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైంది. కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం దీనికి ఛైర్మన్. కన్వీనర్గా ఛత్తీస్గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ వ్యవహరిస్తారు. ఈ కమిటీలో- సిద్ధరామయ్య, ప్రియాంక గాంధీ వాద్రా, ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్, శశిథరూర్, గైఖంగమ్, గౌరవ్ గొగొయ్, ప్రవీణ్ చక్రవర్తి, ఇమ్రాన్ ప్రతాప్గర్హి, కే రాజు, ఓంకార్ సింగ్ మర్కమ్, రంజీత్ రంజన్, జిగ్నేష్ మేవాణి, గుర్దీప్ సప్పల్ ఉన్నారు.
ఇందులో తనకు చోటు కల్పించడం పట్ల సిద్ధరామయ్య.. పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక మోడల్ గవర్నెన్స్ను దేశ ప్రజలు గుర్తించారని అన్నారు. దేశవ్యాప్తంగా కర్ణాటక మోడల్ గవర్నెన్స్ను అమలు చేయడానికి పార్టీ హైకమాండ్ సిద్ధంగా ఉందని చెప్పారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 95 శాతం అమలు చేశామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications