మోదీ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు.. 17 ఏళ్ల పోరాటం..
భారత సైన్యానికి సంబంధించి మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మజూరు చేస్తూ రక్షణ శాఖ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సైన్యంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు ఇప్పటికే పనిచేస్తోన్న వాళ్లు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. 17 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత మహిళలకు సైన్యంలో సమాన హక్కులు పొందటానికి మార్గం సుగమం అయింది.
శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ రక్షణ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆర్మీలోని మొత్తం 10 విభాగాల్లోనూ మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. గతంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) లో 14 ఏండ్లు ఆర్మీలో పనిచేసిన పురుషులు మాత్రమే శాశ్వత కమిషన్ ఎంపికను పొందేవారు. ఈ హక్కు కోసం ఆర్మీలోని మహిళలు ఏకంగా 17 ఏళ్లపాటు న్యాయపోరాటం చేశారు. చివరికి ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు అనుకూల తీర్పు చెప్పింది. మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలంటూ కేంద్రానికి మూడు నెలల గడువు ఇచ్చింది. అయితే..
Recommended Video
కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆలస్యమైనప్పటికీ కేంద్రం ఎట్టకేలకు మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆర్మీ సర్వీస్ కార్ప్స్, ఆర్డినెన్స్, ఎడ్యుకేషన్ కార్ప్స్, అడ్వకేట్ జనరల్, ఇంజనీర్, సిగ్నల్, ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్-మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లోకి మహిళలు ప్రవేశించవచ్చు. అంతేకాదు, మహిళలు కూడా లెఫ్టినెంట్ జనరల్ హోదాకు చేరుకునే వీలుంటుంది. ఎయిర్ ఫోర్స్, నేవీలో మహిళలకు గతం నుంచే శాశ్వత కమిషన్ వర్తిస్తున్నప్పటికీ ఆర్మీలో మాత్రం అవకాశం లేకుండా పోయింది. గురువారం నాటి రక్షణ శాఖ ఆదేశాలతో ఆ లోటును పూడ్చినట్లయింది.